మెమెన్ ఉరితాడు బీహార్ జైల్లో తయారీ, నాటి పేలుళ్లు ఎక్కడెక్కడ?
పాట్నా: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్ను గురువారం ఉదయం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. అతనిని ఉరి తీసిన తాడు బీహార్ జైలు నుంచి వచ్చింది.
మెమెన్ను ఉరి తీసేందుకు ఉపయోగించిన తాడును బీహార్లోని బక్సర్ సెంట్రల్ జైలు సరఫరా చేసింది. ఈ విషయాన్ని బక్సర్ జైలు సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి చెప్పారు.
నేరస్తులను ఉరి తీసేందుకు ఉపయోగించే ఉరితాడును దేశంలోని వివిధ జైళ్లకు పంపిస్తున్నామని, అదే తాడును యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష అమలుకు ఉపయోగించారని చెప్పారు.
ఉరి తీయడానికి గాను రెండున్నర సెంటీమీటర్ల వ్యాసం, 19 అడుగుల పొడవు ఉంటే తాడుని ఉపయోగిస్తారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్లు బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే రెండు తాళ్లను పరీక్షిస్తారు. ఉరిశిక్షను అమలు చేసే ముందు రోజు సాయంత్రం సూపరింటెండెంట్ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు.
మెమెన్ ఉరిని పర్శ్నించన వామపక్షాలు
యాకూబ్ మెమెన్ ఉరిని కాంగ్రెస్, వామపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. మెమెన్ ఉరిని బిజెపి రాజకీయం కోసం వాడుకుంటోందని ఆరోపించారు. అన్ని కేసుల్లోను ఇలాగే వ్యవహరించాలని సూచించారు.
మెమెన్ ఫోటో తీయవద్దు
యాకూబ్ మెమెన్ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెమెన్ మృతదేహానిని ఖననం చేయనున్నారు. కాగా, మెమెన్ మృతదేహాన్ని ఫోటోలు తీయవద్దని ముంబై పోలీసులు ఆదేశించారు.
నాడు వరుసగా బాంబు పేలుళ్లు...
మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి. తొలి బాంబు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ భవంతి బేస్ మెంటులో జరిగింది. ఆ తర్వాత.. రెండు గంటల పాటు అంటే, మూడున్నర గంటల వరకు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి.
మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్, జవేరీ బజార్, కఠా బజార్, హోటల్ సీ రాక్, హోటల్ జుహూ సెంటార్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, సహర్ ఎయిర్ పోర్టు, వర్లి, పాస్ పోర్టు ఆఫీస్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. ఈ పేలుళ్లలో 257 మందికి మృతి చెందగా, 713 మంది గాయపడ్డారు.