మెమన్ ఉరి: భారత్ను హెచ్చరించిన షకీల్
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, ఉగ్రవాది యాకుబ్ మెమన్ మరణ శిక్షపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం వర్గం స్పందించింది. మెమన్ ఉరికి.. భారత్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఓ ప్రముఖ మీడియా సంస్థ(టిఓఐ)కి ఫోన్ చేసిన దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ హెచ్చరించినట్లు సమాచారం.
ముంబై వరుస బాంబు పేలుళ్లలో చోటా షకీల్ కూడా కీలక నిందితుడు. కాగా, ‘ప్రపంచానికి భారత ప్రభుత్వం ఏ సందేశం పంపించాలనుకుంటోంది. అతని సోదరుడు చేసిన పనికి మెమన్ను చంపారు. మెమన్ అమాయకుడు. దీనికి తగిన జవాబు త్వరలోనే చెప్తాం. అసలు దావూద్తో యాకుబ్ సన్నిహితంగా మెలిగాడనే వార్త పూర్తిగా అబద్ధమ'ని తెలిపాడు.
అంతేగాక, ‘యాకుబ్ను భారత ప్రభుత్వం ‘చట్టబద్ధంగా హత్య చేసింది' అని షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాంబు పేలుళ్లలో టైగర్ మెమన్ పాత్రే కీలకమని, కానీ అమాయకుడైన యాకుబ్ మెమన్ను శిక్షించారని మండిపడ్డాడు. మెమన్ ఉరిశిక్షతో ఏ మార్పు కోరుకున్నారని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
భారత ప్రభుత్వంపై నమ్మకం లేదని, దావూద్ ఇబ్రహీం భారతదేశానికి వస్తే అది చావడానికే అవుతుందని షకీల్ తెలిపాడు. దావూద్ తోపాటు తాను కూడా భారతదేశానికి వచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పాడు. కొందరు ప్రభుత్వాన్ని నమ్మారని, అయితే ఆ నమ్మకం ఇప్పుడు లేకుండా చేశారని అన్నాడు.