ముంబైలో ఖననం, సోషల్ మీడియాపై పోలీసుల కన్ను
నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్ను గురువారం ఉదయం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. శవ పరీక్ష అనంతరం యాకుబ్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
యాకుబ్ ఉరిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గురువారం నాడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. కాగా, యాకూబ్ మెమెన్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. అతని మృతదేహానికి ముంబైలో అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి.
ముంబైలోని ముస్లీం శవవాటికలో మెమెన్ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో మెరైన్ లైన్ ముస్లీం శవవాటిక వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
యాకూబ్ మెమెన్ పోస్టుమార్టం పూర్తి అయిందని, పదకొండు గంటలకు అతని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు చెప్పారు.
ముంబైలోని మెరైన్ లైన్ ముస్లీం వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదే స్థలంలో మెమెన్ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
మెమెన్ మృతదేహాన్ని తొలుత మహింలోని అతని ఇంటికి తీసుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఆ తర్వాత శవవాటికకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఆ రహదారిలో భద్రత పెంచారు.
మృతదేహం అప్పగించటే విషయమై డైలమా
మృతదేహాన్ని మెమెన్ కుటుంబ సభ్యులకు అప్పగించే విషయమై జైలు అధికారులు డైలమాలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. జైలులో అతనిని ఖననం చేయాలని తొలుత జైలు అధికారులు భావించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాపై పోలీసుల కన్ను
మెమెన్ ఉరి నేపథ్యంలో సోషల్ మీడియా పైన పోలీసులు కన్నేశారు. తప్పుడు ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మెమెన్ ఉరి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అప్ర్తమత్తంగా ఉండాలని రాష్ట్రలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.