‘ఇక సన్యాసమే’: బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం రాజీనామా చేశారు. తరచూ సొంతపార్టీపై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సంచలనంగా మారిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఆయన 'రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నా' అని ప్రకటించారు. అంతేగాక, తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని 80ఏళ్ల యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు.
జనవరిలో తాను ప్రారంభించిన రాష్ట్రమంచ్ సంస్థ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై నిరవధికంగా పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని యశ్వంత్ సిన్హా తెలిపారు.
కాగా, యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం ప్రధాని మోడీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అయితే, పాట్నాలో యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి పలువురు కాంగ్రెస్ నేతలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, జయంత్ చౌదరి, ఆప్కు చెందిన సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ నేత ఘనశ్యామ్ తివారీ హాజరవడం గమనార్హం.