మోడీకి ఇందిరాగాంధీ గతి: బిజెపి యశ్వంత్ సంచలనం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బిజెపి అసంతృప్త నేత యశ్వంత్ సిన్హా శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అనేక విషయాల్లో చర్చకు తావివ్వడం లేదని ఆరోపించారు.
గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరా గాంధీ ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు గోవాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు యశ్వంత్ సిన్హా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నో రంగాల్లో విఫలమవుతోందన్నారు. యశ్వంత్ సిన్హా చర్చా వేదికలో సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారత దదేశంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. బీజేపీ త్వరితంగా స్పందించకుంటే మరోసారి ఎన్నికలు రాకముందే ప్రజల చీత్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వాజపేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. ప్రధాని మోడీ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు.
ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత 19 నెలల పరిపాలనంతా ఒకేలా సాగిందన్నారు. 1977లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తు చేశారు.
మోడీకి తప్పుడు సలహాలు: శతృఘ్ను సిన్హా
బిజెపిలో అసమ్మతి ఎంపీగా ముద్రపడ్డ బాలీవుడ్ నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వివాదం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున తీర్పు వెలువడే వరకూ ఆగి ఉండాల్సిందన్నారు.
ప్రధాని మోడికి ఇంత గొప్ప సలహాలు ఇస్తున్నది ఎవరోనంటూ వ్యంగ్యంగా అన్నారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని కాదని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం గొలుపుతోందన్నారు. చెప్పారు. కోర్టు తీర్పు వెలువడేవరకూ వేచిచూస్తే కేంద్రం ఈ వివాదంలో చిక్కుకుని ఉండేది కాదన్నారు.
'ప్రధాని నరేంద్ర మోడీ మంచి ఆశయంతోనే పనిచేస్తున్నారు. ఆయనకు సలహాలు ఇస్తున్నవారితోనే అసలు సమస్య. మోడీకి తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వాటివల్ల ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు వస్తోంద'ని ఆయన అన్నారు. ఒక్కోసారి తన అభిప్రాయాలతో కొందరు ఏకీభవించకపోవచ్చునని, అయితే బిజెపికి, జాతికి మేలు జరగాలన్నదే తన ఉద్దేశమన్నారు.