స్టాలిన్తో యశ్వంత్ సిన్హా, శతృఘ్నసిన్హా భేటీ, ఏం జరుగుతోంది?
చెన్నై: మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి యశ్వంత్సిన్హా, బిజెపి ఎంపీ శతృఘ్నసిన్హా శుక్రవారం నాడు చెన్నైలో డిఎంకె చీఫ్ స్టాలిన్ను కలుసుకొన్నారు. ప్రధానమంత్రి మోడీపై సీరియస్గా విమర్శలు చేస్తున్న యశ్వంత్సిన్హా , శతృఘ్నసిన్హా లు స్టాలిన్తో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
యశ్వంత్సిన్హా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదిన బిజెపికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అందరి కళ్ళు శతృఘ్నసిన్హాపై పడ్డాయి. అయితే తాను బిజెపిలోనే కొనసాగుతానని శతృఘ్నసిన్హా అప్పట్లోనే ప్రకటించారు.
విపక్షాలకు చెందిన కొందరు నేతలను కలుసుకోవడం ద్వారా ఆ ఇద్దరు నేతలు గతంలో పలుమార్లు బిజెపి నాయకత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారు.
బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు స్టాలిన్తో సమావేశమయ్యారు. ఇటీవలనే స్టాలిన్తో తెలంగాణ సీఎం కెసిఆర్ సమావేశమయ్యారు.
2019 ఎన్నికలకు ముందు సిన్హా ద్వయం ఏం చేస్తారో అతి దగ్గరగా పరిశీలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసే కూటమికి బిజెపికి వ్యతిరేకంగా తమ ప్రయత్నాలను మద్దతిస్తారా అనేది ఆసక్తి నెలకొంది.
అటల్ బిహరి వాజ్పేయ్ నేతృత్వంలో ఎన్డిఏ ప్రభుత్వంలో శతృఘ్నసిన్హా కేంద్ర మంత్రిగా పనిచేశారు.సుదీర్ఘకాలంగా ఆయన బిజెపికి సేవలు అందిస్తున్నాడు అయితే గత ఏడాది బీహర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో శతృఘ్నసిన్హాకు అవకాశం కల్పించలేదు.
బీహర్ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ ఆర్జెడీ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకొన్న సమయంలో శతృఘ్నసిన్హా నితీష్ను ప్రశంసలతో ముంచెత్తారు.అంతేకాదు ఇటీవల కాలంలో లాలూ తనయులు తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్లను శతృఘ్నసిన్హా కలిశారు. వారిద్దరిని పొగడ్తలతో ముంచెత్తారు.
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై యశ్వంత్సిన్హా గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు విషయమై మోడీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
యశ్వంత్సిన్హా చంద్రశేఖర్ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. అటల్ బిహరీ వాజ్ పేయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు.యశ్వంత్ సిన్హా తనయుడు హజారిబాగ్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ప్రస్తుతం మోడీ క్యాబినెట్ లో కేంద్ర విమానాయానశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.