యశ్వంత్ నిప్పులు: మంత్రిత్వ శాఖల నిర్ణయాలు ప్రధాని కార్యాలయమే కంట్రోల్ చేస్తుంది
ముంబై: అన్ని మంత్రిత్వ శాఖల నిర్ణయాలను, కార్యకలాపాలను ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం కంట్రోల్ చేస్తుందని ధ్వజమెత్తారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. 'సేవ్ డెమొక్రసీ- సేవ్ కాన్స్టిట్యూషన్' పేరుతో ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అన్ని శాఖల నిర్ణయాలు ప్రధాని కార్యాలయమే డిసైడ్ చేస్తోందని ఆరోపించిన ఆయన ఇతర మంత్రులకు ఎలాంటి పనిలేకుండా పోతోందన్నారు. ఎవరైనా మంత్రి తాను బిజీగా ఉన్నానని చెబితే... అప్పుడు ఆయన అబద్ధం చెబుతున్నట్లే లెక్క అని యశ్వంత్ సిన్హా చెప్పారు.
జమ్ముకశ్మీర్లో బీజేపీ పీడీపీతో తెగదెంపులు చేసుకుంటుందన్న విషయం కేంద్ర హోంమంత్రికి తెలియదని చెప్పిన ఆయన...డీమోనిటైజేషన్ విషయం ప్రకటించేవరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియదని ఆరోపించారు. అదేవిధంగా విదేశీ వ్యవహారాలపై సుష్మా స్వరాజ్కు కూడా ముందస్తు సమాచారం ఉండదని చెప్పారు. ఆమె కేవలం ట్విటర్ మంత్రిగానే మిగిలిపోయారని చెప్పారు. రాఫేల్ ఒప్పందం జరిగినప్పుడు రక్షణమంత్రి నిర్మలాసీతారామన్కు తెలియదని చెప్పారు. రాఫెల్ ఒప్పందంలో రూ.35వేల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
సిన్హాకు మద్దతుగా మరో మాజీ మంత్రి అరుణ్ శౌరీ గొంతుకలిపారు. సీబీఐని కేంద్రం తప్పుడు పనులకు వినియోగిస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి కాకుండా బీజేపీ ఛీఫ్ అమిత్ షాకు తొత్తుగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.మరో బీజేపీ రెబల్ నేత శతృఘ్నసిన్హా కూడా మాట్లాడారు. తనకు తానుగా పార్టీని వీడేది లేదంటూ స్పష్టం చేశారు. అయితే తనను పార్టీ నుంచి పొమ్మంటే వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. పార్టీలో ఉండి అదే పార్టీని మీరెందుకు విమర్శిస్తుంటారని చాలామంది తనను ప్రశ్నిస్తుంటారని చెప్పిన శతృఘ్న సిన్హా... తను ముందుగా దేశ ప్రజలకు ప్రాధాన్యత ఇస్తానని ఆ తర్వాత పార్టీకి పార్టీ నాయకత్వానికి నిజయితీగా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని అందుకే వారికి నచ్చదని చెప్పుకొచ్చారు.