ఫ్లాష్ బ్యాక్ 2019: అంతరిక్షంపై ఆధిపత్యాన్ని సాధించినా.. బోరుబావులను జయించలేక చతికిల..!
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఉదంతం.. ఈ ఏడాది మొత్తానికీ అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అభం, శుభం తెలియని ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడి కన్నుమూసిన ఘటన పట్ల దేశం మొత్తం స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మొదలుకుని..ఓ సామాన్యుడి వరకూ అందరి హృదయాన్నీ ద్రవింపజేసింది. ఎక్కడో- కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలను అందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ 20 అడుగుల మేర భూమిలో కూరుకుపోయిన చిన్నారులను మాత్రం సజీవంగా దక్కించుకోలేని దుర్గతిని చాటి చెప్పింది.
ఏమిటీ ఉదంతం..
తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టికి చెందిన ఆరోగ్య రాజ్, కళైమణి రెండో కుమారుడు సుజిత్. తన తండ్రికి చెందిన మొక్కజొన్న పొలంలో ఆడుకుంటూ సుమారు 150 అడుగుల లోతున ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట్లో 25 అడుగుల లోతులో చిక్కుకున్న సుజిత్.. ఆ తరువాత క్రమంగా 88 అడుగుల కింది వరకూ జారిపోయాడు. ఊపిరి ఆడక ప్రాణాలను కోల్పోయాడు.
వెలికి తీతకే నాలుగున్నర రోజులు..
బాధాకరమైన విషయం ఏమిటంటే- ఆ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయడానికి నాలుగున్నర రోజులు పట్టింది. 25వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. 29వ తేదీన తెల్లవారు జామున సుజిత్ మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో వెలికి తీశారు. సుజిత్ సురక్షితంగా వెలికి రావాలని కోరుతూ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు అకాంక్షించారు. తమిళనాడు మొత్తం ఆ నాలుగు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. చివరికి విషాదమే మిగిలింది.
80 గంటల పాటు శ్రమించినా..
అక్టోబర్ 29వ తేదీన తెల్లవారు జామున 3:45 నిమిషాల సమయంలో సుజిత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో సహాయక సిబ్బందికి లభించింది. సుజిత్ చిక్కుకుని ఉన్న ప్రదేశం సమీపానికి చేరుకున్న తరువాత సహాయక సిబ్బంది.. దుర్వాసనను పసిగట్టారు. సుజిత్ ను సజీవంగా వెలికి తీయడానికి తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. సుజిత్ చిక్కుకున్న ప్రదేశాన్ని చేరుకోవడానికి శరవేగంగా సమాంతర గొయ్యిని తీయడానికి నవరత్న కంపెనీలను రప్పించింది. బొగ్గు తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న నైవేలి లిగ్నైట్ కంపెనీ (ఎన్ఎల్సీ), చమురు, సహజవాయువులను వెలికితీసే ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలకు చెందిన హైస్పీడ్ డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ-మద్రాస్ నిపుణుల సహకారాన్ని తీసుకుంది.
తమిళనాడులో విషాద ఛాయలు
సుజిత్ ఇక లేడనే విషయం తెలిసిన వెంటనే తమిళనాడులో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆ చిన్నారి మరణం లక్షలాది మందిని కలచి వేసింది. ఇప్పటికీ ఆ గ్రామ వాసులు గానీ, సుజిత్ తల్లిదండ్రులు గానీ తేరుకోలేకపోతున్నారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా ఆ పార్టీ నేతలు పలువురు ఆరోగ్యరాజ్ కు ధైర్యం చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..
ఇప్పుడున్న భారత్.. ఒకప్పటి భారత్ కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా మారింది. శాస్త్ర,, సాంకేతిక రంగాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. అయినప్పటికీ.. బోరుబావిలో పడిన చిన్నారుల ప్రాణాలను కాపాడటంలో దారుణంగా విఫలమౌతోంది. బోరుబావిలో పడి సజీవంగా బయటికి వచ్చిన చిన్నారులు నలుగురైదుగురు కూడా లేరు. బోరు బావిలో పడితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా.. బోరుబావులను మాత్రం జయించలేకపోతోంది.