అతిలోక సుందరీ హత్యకు గురైందా..? కేరళ పోలీసు బాస్ ఏమన్నారంటే..!!
తిరువనంతపురం : దివి నుంచి భువికి దిగొచ్చిన దేవత, అందాల నటి శ్రీదేవిది సహజ మరణం కాదా ? ఆమెను హత్య చేసి చనిపోయినట్టు చిత్రీకరించారా ? అంటే ఔననే అంటున్నారు కేరళ పోలీసు బాస్. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు. అతిలోక సుందరిది సహజ మరణం కాదని తన స్నేహితుడు, ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ చెప్పినట్టు పేర్కొన్నారు. కేరళ కౌముది వార్తపత్రికలో శ్రీదేవిది సహజ మరణం కాదని కాలమ్ రాశారు రిషిరాజ్ సింగ్. దీంతో దేశవ్యాప్తంగా శ్రీదేవి మృతి అంశం తెరపైకి వచ్చింది.
సహజ మరణమే కానీ ..
గతేడాది ఫిబ్రవరి 24.. అభిమానులకు గుండెకోత మిగిల్చి దివికెగారు అందాల నటి శ్రీదేవి. ఆమె లేరనే వార్త తెలిసి అభిమానులు దిగ్భాంతికి గురయ్యారు. దుబాయ్లో తన కుటుంబానికి చెందిన ఫంక్షన్కెళ్లి చనిపోయారు. బాత్ టబ్లో పడిపోయి మృతిచెందారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే శ్రీదేవి మరణంపై సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ఈ అంశంపై విచారణ మాత్రం జరిపించలేకపోయారు. కానీ ఏడాది తర్వాత కేరళ జైళ్లశాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ పత్రికలో కాలమ్ రాయడంతో కలకలం రేగింది. ఆమె బాత్ టబ్లో పడి చనిపోలేదని స్పష్టంగా పేర్కొన్నారు.
సస్పెక్ట్ డెత్
శ్రీదేవి మృతికి సంబంధించి అనుమానం ఉందని తన మిత్రుడు, ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్ డాక్టర్ ఉమదత్తన్ కూడా తనతో చెప్పినట్టు రాయడం ప్రాధాన్యం కలిగించింది. ప్రముఖ నటి హత్య విషయంలో పోలీసు అధికారికే గాక .. ఫోరెన్సిక్ నిపుణుడికి కూడా అనుమానం రావడం చర్చానీయాంశమైంది. దీనిని బట్టి శ్రీదేవిది సహజ మరణం కాదనే అవకాశాలు ఉన్నాయి. శ్రీదేవి చనిపోయాక ఆత్రుతతో ఏం జరిగిందని అడిగితే సహజ మరణం కాదని ఉమదత్తన్ చెప్పారని గుర్తుచేశారు. అంతేకాదు శ్రీదేవి బాట్ టబ్లో పడి ఎలా చనిపోతారని కొన్ని ప్రశ్నలు సంధించారు. బాత్ టబ్లో కేవలం ఒక అడుగు నీటిలో పడితే ఎలా చనిపోతారని ప్రశ్నించారు. అయితే ఎక్కువ మద్యం సేవిస్తే మాత్రం అవకాశం ఉందని పేర్కొన్నారు. లేదంటే కొందరు ఉద్దేశపూర్వకంగా బాత్ టబ్లో ఊపిరాడనీయకుండా చేస్తే తప్ప చనిపోరని గుర్తుచేశారు.
మరికొందరు కూడా ..
శ్రీదేవిది సహజ మరణం కాదని ఇదివరకు కూడా కొందరు అధికారులు వాదించారు. ఢిల్లీ మాజీ ఏసీపీ వేద్ భూషణ్ కూడా శ్రీదేవి హత్యకు గురైందా అని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీదేవి మద్యం సేవించలేదని సుబ్రమణ్య స్వామి తెలిపారు. దీంతో ఆమెది ముమ్మాటికీ హత్యే అనే వారి సంఖ్య క్రమంగా పెరుగుుంది. ఓ సగటు అభిమానిలో కూడా అతిలోక సుందరిది హత్య అనే అనుమానం ఉంది. కానీ దీనిపై విచారణ జరిపించి నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే శ్రీదేవిది సహజ మరణమనే ముద్రపడి .. నిజం ప్రపంచానికి తెలియకుండా పోయే ప్రమాదం ఉంది.