Year Ender 2020 :వ్యాక్సిన్ నుంచి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మృతి వరకు టాప్ 5 పుకార్లు
2020వ సంవత్సరానికి గుడ్బై చెప్పే సమయం దగ్గరపడుతోంది. 2021కి స్వాగతం చెప్పే సమయం కూడా సమీపిస్తోంది. ఈ క్రమంలోనే 2020లో అందరికీ గుర్తుండిపోయే చేదు తీపి జ్ఞాపకాలు చాలానే ఉంటాయి. ఈ ఏడాది 2020 కొందరికి అత్యంత చేదు అనుభవాలు మిగల్చగా మరికొందరికి తీపి గుర్తులను మిగిల్చింది. 2020లో అత్యంత వేగంగా ప్రచారంలోకి వచ్చిన ఐదు తప్పుడు వార్తలను లేదా రూమర్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
ఆగష్టు 15వ తేదీన కరోనావ్యాక్సిన్ ప్రారంభం
ఈ ఏడాది కరోనా ఏడాదిగా ప్రతి ఒక్కరి మనసుల్లో నిక్షిప్తమైంది.ఇక కరోనావైరస్ విజృంభిస్తుండటంతో దీని కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ఆగష్టు 15న కరోనావైరస్ వ్యాక్సిన్ను ప్రారంభిస్తారంటూ శరవేగంగా వార్తలు జోరందుకున్నాయి. ఎర్రకోట నుంచి తన ప్రసంగం సందర్భంగా ప్రారంభిస్తారని వార్తలు హల్చల్ చేశాయి. అంతకు కొన్ని రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ గురించి ప్రకటన చేశారు. అంతేకాదు తన కూతురు డోస్ను తీసుకుందని చెప్పి ఆమె బాగానే ఉందంటూ పుతిన్ ప్రకటించడంతో.. ప్రధాని మోడీ కూడా వ్యాక్సిన్ను ప్రారంభిస్తారనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అది అవాస్తవంగా మిగిలిపోయింది.
కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా
ఇక కరోనావైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో దీనిపై పూర్తి అవగాహన లేని వారు ఈ మహమ్మారి గాలిద్వారా వ్యాపిస్తుందని భావించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది భయాందోళనకు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పకుండా మాస్కులు ధరించాల్సిందే అని చెప్పడంతో గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో గాలి నుంచి కరోనా వ్యాపిస్తుందని వస్తున్న వార్తల్లో లేదా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పరిశోధకులు తేల్చారు. గాలి ద్వారా కాదు కాని శరీరంలోని బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.
మళ్లీ లాక్డౌన్ విధింపు
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సంచలన ప్రకటన చేశారు. అజాగ్రత్త, ఉదాసీనత, గాలి కాలుష్యం వల్లే కరోనా మహమ్మారి తిరిగి పంజా విసురుతోందని వ్యాఖ్యానించారు.ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇక బ్రిటన్లో సెకండ్ వేవ్ ప్రారంభం అవడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండో సారి లాక్డౌన్ ప్రకటించారు.ఫ్రాన్స్ కూడా రెండో సారి లాక్డౌన్ విధించింది. దీంతో మన దేశంలో కూడా రెండో సారి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కిమ్ మరణంపై ప్రచారం
ఇక 2020లో బాగా చర్చ జరిగిన పేరు కిమ్ జాంగ్ ఉన్ . ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు మృతి చెందాడంటూ ముందుగా వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఓ మూడు సంఘటనలను చాలామంది చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 15న ఉత్తరకొరియా వ్యవస్థాపకులు ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న తాత అయిన కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ హాజరు కాలేదు. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కిమ్ జాంగ్ ఉన్కు సర్జరీ జరిగిందని తాను కోలుకుంటున్నాడని ఓ వార్తా వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఇక చివరిగా కొన్ని ప్రపంచస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కిమ్ మృతి చెంది ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఓ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ కనిపించి ఈ రూమర్లకు చెక్ పెట్టారు.
Recommended Video
కరోనా గబ్బిలాలు, పాముల నుంచి వచ్చిందా..?
ఈ ఏడాది మొత్తం అత్యధికంగా చర్చించిన పదం కరోనావైరస్. కరోనావైరస్కు మూలం ఏంటనేదానిపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారికి మూలం గబ్బిలాలు, పాములు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వాదనను శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. గబ్బిలాలు, పాముల నుంచి వైరస్ వ్యాపిస్తోందని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఏవీ లేవని చెప్పారు. సాధారణంగా సార్స్ కోవ్-2 గబ్బిలాలు క్యారీ చేస్తాయనేది వాస్తవం. అయితే మనుషులకు వ్యాపించాలంటే మధ్యలో మరొకటి ఏదైనా ఉండాలి. ఈ క్రమంలోనే పాములు హోస్ట్గా వ్యవహరిస్తున్నాయంటూ ఓ స్టడీ పేర్కొంది. కానీ వాస్తవానికి కరోనా వైరస్ కేవలం క్షీరదాలు, పక్షులకు మాత్రమే వస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పారు.