రక్షణ వ్యవస్థ సత్తా: బ్రహ్మాస్త్రాన్ని అందిపుచ్చుకొన్న భారత్: మరపురాని ఏడాదిగా
న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థ సత్తాను చాటిన సంవత్సరంగా 2020.. చరిత్రలో మిగిలిపోనుంది. ఒకవైపు పాకిస్తాన్ చొరబాటు యత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు చైనా దురాక్రమణను భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. అదే సమయంలో- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఏడాదే భారత అమ్ములపొదిలో చేరాయి. ఫ్రాన్స్కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసిన ఈ యుద్ధ విమానాల తొలి బ్యాచ్.. భారత్లో అడుగు పెట్టింది ఈ సంవత్సరమే. జులై 29వ తేదీన అయిదు రాఫెల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్నాయి.
Recommended Video
36 రాఫెల్ ఫైటర్ జెట్స్..
మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళాధికారులు కొనుగోలు చేశారు. వాటిని తయారు చేయడానికి డస్సాల్ట్ ఏవియేషన్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ట్విన్ ఇంజిన్స్ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఙానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు.
ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే..
ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ వంటి వ్యవస్థలు రాఫెల్లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి.
15.30 మీటర్ల పొడవుతో..
రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. ఇలాంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.
అంబాలా ఎయిర్బేస్ కేంద్రంగా..
హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ కేంద్రంగా తొలిదశ రాఫెల్ యుద్ధ విమానాలు కార్యకలాపాలను ప్రారంభించాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ అయిదింటినీ లాంఛనంగా వైమానిక దళంలో ఇండక్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ సాయుధ బలగాల మంత్రి ఫ్లోరెన్స్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిగిలిన 31 రాఫెల్ యుద్ధ విమానాలు దశలవారీగా భారత్కు రానున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి అవన్నీ భారత్కు చేరొచ్చని తెలుస్తోంది.