Year Ender : దేశ ముఖచిత్రంపై బలమైన నిరసన ముద్ర.. సీఏఏతో మొదలు,రైతు నిరసనలతో ముగింపుకు
ఈ ఏడాది ఆరంభంలో సీఏఏ వ్యతిరేక నిరసనలు... ముగింపుకు వచ్చేసరికి రైతు నిరసనలు... ఈ రెండూ అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించినవే. సీఏఏ ముస్లిం వ్యతిరేక చట్టంగా విమర్శలు మూటగట్టుకోగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు లోకం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని షాహీన్బాగ్ వేదికగా దాదాపు 100 రోజుల పాటు సీఏఏ వ్యతిరేక ఉద్యమం నడిచింది. అదే ఢిల్లీ వేదికగా గత 10-12 రోజుల నుంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం నడుస్తోంది. ఈ ఏడాది దేశ ముఖచిత్రంపై బలమైన ముద్ర వేసిన సీఏఏ,రైతు నిరసనల గురించి 'year ender'లో ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సీఏఏ చట్టం ఏం చెబుతుంది...
డిసెంబర్ 11,2019న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జనవరి 10,2020 నుంచి చట్టం అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం... డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్,పాకిస్తాన్ దేశాల నుంచి భారత్లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు దేశంలో పౌరసత్వం కల్పిస్తారు. అయితే ఈ చట్టంలో ముస్లింలకు అవకాశం కల్పించకపోవడం పట్ల ఆ వర్గంతో పాటు ప్రతిపక్షాలు,ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇవాళ ముస్లింలను పక్కనపెట్టినవారు.. భవిష్యత్తులో మరిన్ని వర్గాలను దూరం పెడుతారని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సీఏఏపై కేంద్రం...
కేంద్రం వాదన ప్రకారం... ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్,పాకిస్తాన్ దేశాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్లపై అక్కడ అణచివేత కొనసాగుతోంది. అక్కడ ఎదురవుతున్న అణచివేతను తట్టుకోలేక శరణార్థులుగా వారు భారత్లోకి వస్తే మానవతా దృక్పథంతో వారికి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తారు. అలాగే సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఆ దేశాల్లో మెజారిటీ మతంలో ఉన్న ముస్లింలు అణచివేతకు గురయ్యే అవకాశం లేదు కాబట్టి వాళ్లు శరణార్థులుగా వచ్చే అవకాశం ఉండదని కాబట్టి సీఏఏలో వారికి చోటు లేదని కేంద్రం చెబుతోంది. అయితే సీఏఏ తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) జాబితాను తీసుకొచ్చి తమను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తారని ముస్లిం వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎందుకు సీఏఏ వ్యతిరేక నిరసనలు..?
కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని షాహీన్ బాగ్ వేదికగా దాదాపు 100 రోజుల పాటు ముస్లింలు ఉద్యమించారు. ఢిల్లీలోనే కాదు... దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. కాంగ్రెస్ సహా దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు,అభ్యుదయ వాదులు ఈ నిరసనలకు మద్దతు తెలిపారు. ఈ ఏడాది మార్చి 25న కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో సీఏఏ నిరసనలకు తెరపడింది.
సీఏఏ నిరసనలపై అంతర్జాతీయ సమాజం కూడా స్పందించింది. ముస్లిం సామాజిక వర్గంపై సీఏఏ తీవ్ర ప్రభావం చూపుతుందంటూ యూఎన్వో అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ ప్రకటన విడుదల చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీలు రెండూ హిందూత్వ భావజాలం నుంచే పుట్టుకొచ్చాయని అభిప్రాయపడింది. సీఏఏ పేరుతో ముస్లింలను ఎన్ఆర్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
వ్యవసాయ చట్టాలు...
ఈ ఏడాది సెప్టెంబర్ 27న నిత్యావసర సరకుల(సవరణ) బిల్లు,రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు', రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 చట్టం రూపం దాల్చాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పటి నుంచే రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం వాదన ప్రకారం ఈ బిల్లుల ద్వారా రైతులకు మేలు జరగనుంది. నిత్యావసర సరుకుల వస్తు ఉత్పత్తి,సరఫరా,పంపిణీ,నిల్వలను కేంద్రం నియంత్రిస్తుంది. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాగే కార్పోరేట్లతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.
రైతుల అభ్యంతరాలు..
ఈ చట్టాల్లో ఎక్కడా కనీస మద్దతు ధర గురించి కేంద్రం హామీ ఇవ్వలేదని రైతులు,ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఒకరకంగా ఇది ప్రైవేట్,కార్పోరేట్ కంపెనీల దయా దాక్షిణ్యాలకు రైతులను వదిలేయడమేనని అంటున్నారు. నిత్యావసర సరకుల చట్టంతో తృణ ధాన్యాలు,పప్పులు,నూనె గింజలు,వంట నూనెలు,ఉల్లి,బంగాళదుంపలు తదితర సరుకులు ఆ జాబితా నుంచి తొలగించబడుతాయి.
దీంతో కార్పోరేట్లు వీటిని భారీ మొత్తంలో తమ గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు విక్రయించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పద్దతిలోనూ రైతులు తమ ఇష్టానుసారం ప్రైవేట్ లేదా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ వ్యాపారులకు స్వేచ్చా వాణిజ్యానికి అవకాశ కల్పిస్తే వ్యవసాయాన్ని క్రమేపీ ఆక్రమిస్తారని... ఏ పంటలు పండించాలి,ఎంత ధర చెల్లించాలి వంటివన్నీ వాళ్ల చేతిలో నిర్ణయాలుగా మారిపోతాయని అంటున్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులపై పూర్తిగా ఆధారపడటమం... మార్కెట్ యార్డులు క్రమేపీ అంతరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షేమం,అభివృద్ది నుంచి పూర్తిగా తప్పుకునే పరిస్థితులకు దారితీస్తుందంటున్నారు. అన్నింటికీ మించి కార్పోరేట్ శక్తులు రసాయన ఎరువులతో తమ పంట నేలలను పూర్తిగా విషతుల్యం చేస్తాయని... తద్వారా ఆ నేల ఎందుకు పనికి రాకుండా పోతుందని అంటున్నారు.
ఢిల్లీ కేంద్రంగా నిరసనలు...
ఈ నేపథ్యంలోనే గత 10,12 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనకు దిగారు. వీళ్లంతా దాదాపుగా ఉత్తరాది రైతులే. అయితే క్రమంగా దక్షిణాది నుంచి కూడా వీరికి మద్దతు పెరుగుతోంది. డిసెంబర్ 8న భారత్ బంద్కు దక్షిణాదికి చెందిన టీఆర్ఎస్,డీఎంకెతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 18 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలన్నదే అటు రైతులు,ఇటు విపక్షాల ప్రధాన డిమాండ్. అంతర్జాతీయ సమాజం కూడా రైతు నిరసనలపై స్పందించింది. కెనడా ప్రధాని ట్రూడో ఇప్పటికే రెండుసార్లు రైతులకు తమ మద్దతు ప్రకటించారు. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి కూడా రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రం రైతులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరో దఫా డిసెంబర్ 9న చర్చలు జరగనున్నాయి.