year ender 2020 : కాంగ్రెస్ను మలుపుతిప్పిన ఏడాది- సంక్షోభం నుంచి అంతర్మథనానికి
దేశంలోనే అత్యంత అనుభవం కలిగిన రాజకీయ పార్టీగా గుర్తింపు కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది చెప్పుకోడడానికి మిగిలింది సంక్షోభాలే. అన్నీ బావున్నప్పుడు అధికారం అనుభవించిన నేతలు.. వరుస ఓటములు కాగానే మొహం చాటేయడం మొదలుపెట్టారు. అప్పటివరకూ దైవంగా పూజించిన నాయకత్వాన్నే ప్రశ్నించే స్ధితికి వచ్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ మీ వల్లే అన్న నేతలు ఇప్పుడూ అదే మాట చెబుతున్నారు. తద్వారా మీరు మారితే పార్టీ స్ధితిగతులు మారతాయని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఊహించని ఈ సవాల్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటాలియన్ సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ దిక్కులు చూస్తున్నారు.
వరుస ఓటములతో కుదేలు..
2014లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఘోర పరాజయం తర్వాత అధినేత్రి సోనియాగాందీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు.. ఐదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీని గాడిన పెట్టలేకపోయింది. దీంతో తిరిగి 2019లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఈ ఐదేళ్లలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, మిగతా విపక్షాలకు పెద్దన్నగా వ్యవహరించి ఉంటే ఆ పరిస్ధితి వచ్చేది కాదు. కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు తాను రాజకీయాలు వదిలేశాక కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ దృష్టి కోల్పోయింది. రాజకీయాల్లో ఓటములు సహజమే అయినా దాన్నుంచి బయటపడేందుకు ఎంచుకోవాల్సిన మార్గాన్ని మాత్రం కాంగ్రెస్ ఎంచుకోలేదు. దీంతో మరో ఓటమి భారాన్ని భరించక తప్పలేదు. దీంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకున్నారు.
మూలిగే కాంగ్రెస్పై సీనియర్ల తిరుగుబాటు
అసలే ఓటమి భారంతో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఈ ఏడాది భారీ షాకులిచ్చారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆగస్టు సంక్షోభం. ఏకంగా పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ కాంగ్రెస్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. దీంతో వీరికి ఎలా నచ్చజెప్పాలో తెలియక సోనియా అంతర్మథనంలో పడ్డారు. రాహుల్ అయితే పార్టీలో కొందరు బీజేపీకి తొత్తులుగా మారారంటూ ఘాటు వ్యాఖ్యలకు దిగారు. దీంతో అసంతృప్తుల విషయంలో కాంగ్రెస్కు ఓ వైఖరి అంటూ లేకుండా పోయిందని తేలిపోయింది. చివరికి సీడబ్ల్యూసీ సమావేశంలో మరి కొన్నాళ్లపాటు సోనియానే అధినేత్రిగా కొనసాగాలని తీర్మానం చేసి అప్పటికి బయటపడ్డారు.
కర్తవ్య బోధ చేసిన ప్రణబ్ ఆత్మకథ..
కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ట్రబుల్ షూటర్గా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తాన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో "ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్" పేరుతో తన స్వీయచరిత్ర రాశారు. అందులోనూ ఆయన పార్టీకి ఓ విధంగా దిశానిర్దేశం చేశారు. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టి కోల్పోయిందని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడంలో సోనియా వైఫల్యాన్ని ఆయన ఎత్తి చూపారు. అయితే ప్రణబ్ చనిపోయాక విడుదలవుతున్న ఈ ఆత్మకథలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పెద్దలకు మంటపుట్టించినా.. పార్టీపై తిరుగుబాటు చేసిన సీనియర్లకు మాత్రం కొండంత బలాన్నిచ్చాయి. వాస్తవ దృష్టితో చూస్తే ప్రణబ్ ఆత్మకథ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శి అయ్యేలా కనిపిస్తోంది.
Recommended Video
త్వరలో కాంగ్రెస్ చింతన్ బైఠక్
ఈ ఏడాది ఆగస్టులో సీనియర్ల తిరుగుబాటుకు సమాధానం వెతుక్కోలేక నానా అవస్ధలు పడిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ఆమె తనయుడు రాహుల్కు తాజాగా లీకైన ప్రణబ్ ఆత్మకథలో చెప్పిన అంశాలు మాత్రం ఎక్కడో తాకాయి. దీంతో సోనియా సీనియర్లను పిలిపించుకుని సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా, త్వరలో పార్టీలో లోపాల్ని సవరించుకునేందుకు చింతన్ బైఠక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి పంపించారు. సీనియర్ల తిరుగుబాటు సమయంలో కేవలం నిర్ణయాల గురించి ఆలోచించిన కాంగ్రెస్ అధినేత్రి.. తాజాగా అంతర్మథనానికి సిద్ధం కావడం పెను మార్పుకు సంకేతంగా దేశంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు సాధారణణ కార్యకర్తలు సైతం సోనియా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.