కశ్మీర్ విలీనం, కరోనాపై పోరాటం, అయోధ్యలో మందిరం, సీఏఏ.. మోడీ 2.0పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
మోడీ 2.0 ప్రభుత్వం అనూహ్యమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. మోడీ 2.0 ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ఏడాదిలో సాధించిన విజయాలను మీడియాతో పంచుకున్నారు. కరోనా మహమ్మారిపై రాజీలేకుండా పోరాటం చేస్తున్నామని నడ్డా వివరించారు. ప్రతీ నిత్యం ప్రజలతో సంప్రదింపులు జరుపుతూ.. వారి రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
లాక్డౌన్ 5.0: కంటైన్మెంట్ జోన్లలోనే, మిగతా చోట్ల మరిన్ని సడలింపులు, స్కూళ్లపై జూలైలో...
కరోనా వైరస్ వల్ల పెద్ద దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయని నడ్డా తెలిపారు. కానీ దేశంలో ఇప్పటికీ పరిస్థితి తమ అదుపులోనే ఉంది అని వివరించారు. కరోనా వైరస్ విస్తరించకుండా మోడీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని కొనియాడారు. దీంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉగ్రవాద నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేశామని వివరించారు. బ్యాంకుల విలీనం మోడీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ను భారత్లో విలీనం చేశామన్నారు. జాతీని మరింత బలోపేతం చేసి.. వన్ నేషన్, వన్ కానిస్టిట్యూషన్ అమలు చేశామని.. ఇదీ భారత్లో కశ్మీర్ అంతర్భాగం అవడంతో సాధ్యమైందని చెప్పారు.
పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయోధ్య అంశంపై కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసిందని.. కానీ మోడీ ప్రభుత్వం సున్నితమైన సమస్యను పరిష్కరించడంతో సఫలీకృతమైందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.