మానసిక ఒత్తిడితో భారత్లో ఏటా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే..?
అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తోంది. 1992 నుంచి ఇలా పాటించడం జరుగుతోంది. ప్రతి ఏటా మానసికంగా కృంగిపోతున్న వారిలో అవగాహన కల్పించడం స్ట్రెస్ను ఎలా తట్టుకోవాలో ఈ సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 8 లక్షల మంది మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఇక భారత్ విషయానికొస్తే ఆ సంఖ్య 2.2 లక్షలుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో నాలుగోవంతు భారత్ నుంచే..
భారత దేశంలో ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉన్నవారు ఒత్తిడిని తట్టుకోలేక, మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇలా ఏడాదికి 2.2 లక్షల మంది చనిపోయినట్లు చెబుతున్నారు. ఇక పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇక ఏడాదికి 2.2 లక్షల మంది ఒక్క భారత్లోనే చనిపోతున్నారంటే ... ప్రపంచవ్యాప్తంగా మానసికంగా కృంగిపోయి సంభవిస్తున్న మరణాల్లో నాలుగోవంతు మరణాలు భారత్లోనే జరుగుతున్నాయని పేర్కొంది.
భారత్లో అతి తక్కువ మంది సైకియాట్రిస్టులు
మానసిక ఆరోగ్యంపై భారత్లో మరింత దృష్టి సాధించడం జరుగుతోంది.జాతీయ ఆరోగ్య సంస్థ మరియు ఐఆర్డీఏలు తాము ఇస్తున్న ఆరోగ్యబీమా ప్యాకేజీల్లో అల్జీమర్స్ వ్యాధిని కూడా చేర్చాల్సి వస్తోంది. 1.35 బిలియన్ మంది ఉన్న భారత్లో కేవలం 6వేల మంది మాత్రమే సైకియాట్రిస్టులు ఉన్నారు. ఇది చాలా తక్కువ అని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతోంది. భారతదేశం, 192 ఇతర దేశాలతో పాటు సంతకం చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మానసిక ఆరోగ్యం కీలకంగా ఉంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు 0.3శాతం సైకియాట్రిస్టులు, 0.12 శాతం సైకాలజిస్టులు, 0.07శాతం సామాజిక కార్యకర్తలు సరిపోరని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది.
హానికరమైన రసాయనాలపై నిషేధం విధించాలి
ఇప్పటికే పలు ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆత్మహత్యల నివారణపై పలు పరిశోధనలు చేశాయి. పాఠశాలల్లో, ఇతర కమ్యూనిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆరోగ్యానికి హానికరమైన విషరసాయనాలపై నిషేధం విధించాలని కోరుతోంది. ఇలా జరిగితే ఆత్మహత్యలను చాలావరకు నివారించొచ్చని వెల్లడించింది. మరోవైపు మెడికల్ సిబ్బందికి సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణ, ఆత్మహత్య నివారణ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు విడుదల చేయాలని సూచించింది.