ఆషాఢమాసం చివరి శుక్రవారం..చాముండి అమ్మవారి ఆశీర్వాదం: అందుకే హడావుడి ప్రమాణం!
బెంగళూరు: కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్డియూరప్ప శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ వజూభాయ్ వాలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 6 నుంచి 6:15 మధ్యకాలంలో బెంగళూరులోని రాజ్భవన్లో యడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకున్నారు. 105 మంది సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని ఆయన గవర్నర్కు అందజేశారు.
ఆగలేకపోతున్న యడ్డియూరప్ప: ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని వివరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్ అంగీకరించారు. సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకార కాలాన్ని నిర్ధారించారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం మంచిరోజు అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తే.. చాముండేశ్వరి అమ్మవారి ఆశీర్వాద బలం ఉంటుందని యడ్డియూరప్ప గట్టిగా విశ్వసిస్తున్నారని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం శాసనసభలో బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 103 పడిపోయింది. బీజేపీకి 105, కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 99 మంది సభ్యుల బలం ఉంది. దీనితో తగినంత సంఖ్యాబలం ఉన్నందున గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి అవకాశాన్ని కల్పించారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాజ్భవన్లో జరిగే కార్యక్రమం సందర్భంగా యడ్డియూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రావణ మాసం ఆరంభంలో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 23 మందితో మంత్రివర్గం ఏర్పాటు అవుతుందని తెలుస్తోంది.