ఆగలేకపోతున్న యడ్డియూరప్ప: ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి ఆదేశాలు అందనప్పటికీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బీఎస్ యడ్డియూరప్ప సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాతో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని కోరారు. తమ పార్టీ శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రిగా తనను సమర్థిస్తున్నారని వెల్లడించారు. 105 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు.
కర్నాటకంలో అనూహ్య ఘట్టం: రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు?
మధ్యాహ్నం 12:30 గంటలకు మంచి ముహూర్తం ఉందని, ఆ సమయానికి తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తన కోరికను వెల్లడించారు. తొలిదశలో తాను మాత్రమే ప్రమాణం తీసుకుంటానని, శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న తరువాత మంత్రివర్గాన్ని విస్తరింపజేస్తానని గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సరిగ్గా 10 గంటలకు యడ్డియూరప్ప హుటాహుటిన రాజ్భవన్కు వెళ్లారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన అతికొద్ది మంది ముఖ్యులు మాత్రమే ఉన్నారు.
105 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు పత్రాన్ని యడ్డియూరప్ప గవర్నర్కు అందజేశారు. కర్ణాటకలో 14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేక కుప్పకూలిన మూడురోజుల్లోనే యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు. ప్రమాణ స్వీకారం చేయడానికి యడ్డియూరప్పకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చిందని అంటున్నారు.