సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్ప
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనలకు దిగారు.
మంగళూరులో నిరసనకారులు విధ్వంసానికి దిగుతుండటంతో పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేసి, కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు నిరసనకారులు మృతి చెందారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక ముంఖ్యమంత్రి యడ్యూరప్ప.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కుద్రోలికి చెందిన జలీల్(43), బెంగ్రేకు చెందిన నౌషీన్(49)లు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. గురువారం నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వీరిద్దరి ప్రాణాలు కోల్పోయారు. విధ్వంసానికి పాల్పడటంతోనే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
అయితే, తమ తండ్రి జలీల్ నిరసనల్లో పాల్గొనలేదని, అటుగా వెళుతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడని జలీల్ కూతురు చెబుతుండటం గమనార్హం. తమ తండ్రిని అన్యాయం చంపేశారని ఆమె వాపోయింది. కాగా, జలీల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా, ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వమే హోంమంత్రిని డిస్మిస్ చేయాలని అన్నారు. పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇద్దరి మరణానికి కారణమైన పోలీసు ఉన్నతాధికారుపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు ఆందోళనలు జరుగుతుంటే.. మరోవైపు ఆ చట్టానికి మద్దతు పలుకుతూ పలువురు ర్యాలీలు తీస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి తాము మద్దతు ఇస్తున్నట్లు పలు యూనివర్సిటీలకు చెందిన వెయ్యికిపైగా ప్రొఫెసర్లు ప్రకటించడం గమనార్హం.