నాడు వాజ్పేయ్, నేడు యడ్యూరప్ప: విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత విశ్వాస పరీక్షను ఎదుర్కోక ముందే ఆయన రాజీనామా చేశారు. 1996 లో కూడ అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయ్ కూడ విశ్వాస పరీక్షను ఎదుర్కోక ముందే ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకొన్నారు. నాడు వాజ్పేయ్ తరహలోనే యడ్యూరప్ప సీఎం పదవి నుండి తప్పుకొన్నారు.
1996లో సైతం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయీ ఇదే విధంగా రాజీనామా చేశారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పక్షానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లభించలేదు. భాజపా కూటమికి 161, కాంగ్రెస్కు 140 సీట్లు లభించాయి. ప్రాంతీయ పార్టీలైన తమిళమానిల కాంగ్రెస్ ఇతర పార్టీలకు మిగిలిన సీట్లు లభించాయి. అయితే రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ వాజ్పేయీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్కు మద్దతు ప్రకటించింది. యునైటెడ్ ఫ్రంట్లో జనతాదళ్, తమిళమానిల కాంగ్రెస్లు కీలకంగా ఉన్నాయి. వామపక్ష కూటమి కూడా వీరికే మద్దతు పలికింది.
ఆనాడు ప్రధాని వాజ్పేయీ 13 రోజుల అనంతరం లోక్సభలో విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నారు. ఆయన ఆశించిన రీతిలో అనేకపక్షాలు ఆయనకు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన విశ్వాసపరీక్షకు ముందు సుదీర్ఘమైన ప్రసంగం చేసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
2014 ఎన్నికల్లో బిజెపికి 104 ఎమ్మెల్యేల సీట్లు దక్కాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి కనీసం 7 సీట్లు అవసరం. కానీ కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ బట్టబయలు చేసింది. ఈ తరుణంలో విశ్వాస పరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తమకు లేదని ముందే తెలిసిన యడ్యూరప్ప అసెంబ్లీ వేదికగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
1996లో వాజ్ పేయ్ ఏ రకంగా పార్లమెంట్ వేదికగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారో, అసెంబ్లీ వేదికగా యడ్యూరప్ప కూడ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.