రూ. వేల కోట్ల స్కాం: చిక్కుల్లో మాజీ సీఎం పీఏ, బీజేపీ మాజీ మంత్రి, సీఎం ట్వీట్ తో రచ్చరచ్చ !
బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యువెలర్స్ స్కాం కేసులో మాజీ మంత్రి, బెంగళూరు రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అరెస్టు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన తరువాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప వ్యక్తిగత సహాయకుడు (పీఏ) సంతోష్, బీజేపీ మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ చిక్కుల్లో పడ్డారు. ఈ విషయంలో సీఎం కుమారస్వామి ట్వీట్ చెయ్యడంతో రచ్చరచ్చ అయ్యింది.
సీఎం కుమారస్వామి ట్వీట్
బెంగళూరులోని శివాజీనగర్ రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ట్వీట్ చేశారు. సీఎం కుమారస్వామి చేసిన ట్వీట్ లో రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు సంబంధించిన విమాన ప్రయాణ టిక్కెట్ వివరాలు ఉన్నాయి.
విమాన టిక్కెట్ లో పేరు
రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ విమాన టిక్కెట్లలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప వ్యక్తిగత సహాయకుడు సంతోష్ పేరు ఉంది. ఈ విషయంలో రోషన్ బేగ్ ను ఎస్ఐటీ అధికారులు అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప వ్యక్తిగత సహాయకుడు సంతోష్ అక్కడే ఉన్నారని, అధికారులను చూసి అక్కడి నుంచి పారిపోయాడని సీఎం కుమారస్వామి ట్వీట్టర్ లో వివరించారు.
రెబల్ ఎమ్మెల్యేకి సహాయం ?
యడ్యూరప్ప పీఏ సంతోష్ తో పాటు బీజేపీ మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ సైతం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నారని సీఎం కుమారస్వామి ట్వీట్టర్ లో వివరించారు. మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ బెంగళూరు వదిలి పారిపోవడానికి బీజేపీ సహకరించిందని, ఇది చాల సిగ్గుచేటు అని సీఎం కుమారస్వామి ట్వీట్టర్ లో మండిపడ్డారు.
బీజేపీ మాజీ మంత్రి పరార్
రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను అరెస్టు చేసిన తరువాత బీజేపీ మాజీ మంత్రి సీపీ. యెగేశ్వర్ అక్కడి నుంచి పారిపోయాడని సీఎం కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ నాయకులు గుర్రాలను కొనుగోలు చేసినట్లు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది చాల సిగ్గుచేటు అని సీఎం కుమారస్వామి మండిపడుతున్నారు.
బీజేపీ లీడర్స్ కు నోటీసులు !
ఐఎంఏ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ బెంగళూరు వదిలి పారిపోవడానికి సహకరించారని ఆరోపిస్తూ మాజీ సీఎం యడ్యూరప్ప పీఏ సంతోష్, మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్ కు ఎస్ఐటీ అధికారులు నోటీసులు జారీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.