కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు: యడ్యూరప్ప, సీఎం పదవిపై శివకుమార్
బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఉండలేవని బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. అధికార దాహం, దురాశతోనే ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉండలేవని, మూడు నెలలకు మించి ఈ ప్రభుత్వం నిలబడదన్నారు.
కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం నేపథ్యంలో బెంగుళూరులో బీజేపీ నిరసన దినాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా యడ్డీ మాట్లాడారు. ఆకలి, దురాశ, అధికారం అన్నవి జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మూలకాలని, అందుకే ఈ సంకీర్ణం ఎక్కువ కాలం ఉండదన్నారు.
సీఎం పదవిపై శివకుమార్ ఆసక్తికరం
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్లు తానెప్పుడు చెప్పలేదన్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ఆయన మాట్లాడారు. కాంగ్రెస్లో ఎవరూ అసంతృప్తితో లేరన్నారు. తామంతా కలిసే ఉన్నామన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో తామంతా సంబరాల్లో ఉన్నామన్నారు.
ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించినట్లు ఎప్పుడూ చెప్పలేదని, ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందన్నారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారిన సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.