యడియూరప్పకు ఆ నిబంధన వర్తించదు.. నడ్డా ఏం చెప్పారంటే..?
న్యూఢిల్లీ : బీజేపీలో కొత్తగా 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయించబోమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు స్పష్టంచేసింది. మోడీ మొదటి క్యాబినెట్లో కేంద్రమంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. దీంతో కర్ణాటక సీఎం అభ్యర్థి యడియూరప్ప అంశం తెరపైకి వచ్చింది. యడియూరప్పకు 76 ఏళ్లు అయినందున సీఎం పదవీ ఎలా కట్టబెడుతారని చర్చకు దారితీసింది.
ఈ అంశంపై ఇంటా బయట విమర్శలు మొదలవుతాయనే ఉద్దేశంతో బీజేపీ ముందుగానే స్పందించింది. యడియూరప్పకు 76 ఏళ్లు వచ్చాయని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై అప్పటికే ప్రిపేర్ అయ్యారో ఏమో కానీ .. నడ్డా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయితే కర్ణాటక బీజేఎల్పీ నేత యడియూరప్ప అని గుర్తుచేశారు. అందుకోసమే ఆయన పేరు సీఎంగా తెరపైకి వచ్చిందని కామెంట్ చేశారు. అంటే తమకు ఇష్టమొచ్చిన వారు ఎవరైనా సరే .. నిబంధనలు వర్తించవని చెప్పకనే చెప్పారు నడ్డా. అదేదో పాత సామెత వడ్డించేవాడు మనోడైతే అన్నట్టు బీజేపీ హైకమాండ్ వ్యవహరశైలి ఉంది.
దీంతోపాటు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే .. అబ్బే తామేం చేయలేదని పేర్కొన్నారు. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్లో అంతర్గత కలహాలే ప్రభుత్వం పడిపోయేందుకు కారణమైందని వివరించారు. తమకు దాంతో ఏం సంబంధం లేదని తేల్చిచెప్పారు. వారు పోట్లాడుకొని ప్రభుత్వం పడిపోతే తమకేంటి సంబంధం అని ఎదురు ప్రశ్నించారు.