1000 కోట్లిచ్చి కొన్నారు..: సీఎం యడ్యూరప్పపై అనర్హత ఎమ్మెల్యే సంచలనం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై అనర్హత వేటుకు గురైన ఓ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. సీఎం యడ్యూరప్ప తనకు రూ. 1000 కోట్లు ఇచ్చాడని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే నారాయణ గౌడ చెప్పారు. ఆ మొత్తాన్ని తాను తన నియోజకవర్గం కృష్ణరాజ్పేట్ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఉదయమే యడ్యూరప్ప ఇంటికి..
‘కొందరు మా ఇంటికి వచ్చి నన్ను బీఎస్ యడ్యూరప్ప నివాసానికి ఉదయం 5 గంటలకు తీసుకెళ్లారు(హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ముందు). మేము అక్కడికి వెళ్లే సమయానికి యడ్యూరప్ప పూజలో ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరి వచ్చి కూర్చోమన్నారు. తాను మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకు మద్దతివ్వాలని యడ్యూరప్ప కోరారు ' అని నారాయణ గౌడ వెల్లడించారు.
700 కోట్లడిగితే.. 1000 కోట్లిచ్చారు.. అలాంటి గొప్ప వ్యక్తికి..
‘నేను నా నియోజకవర్గం కృష్ణరాజ్పేట్ అభివృద్ధి కోసం రూ. 700 కోట్లు కేటాయించాలని కోరాను. ఇందుకు అతను(యడ్యూరప్ప) మరో 300 కోట్లు జత చేసి రూ. 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత డబ్బును నాకు అందజేశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వకుండా ఎలా ఉండగలను. అందుకే మద్దతిచ్చా. అనర్హత ఎమ్మెల్యేల నుంచి ఏమీ ఆశించలేమని, వారితో సంబంధం లేదని యడ్యూరప్ప చెప్పారు' అని నారాయణ గౌడ తెలిపారు.
సొంత నేతలపై యడ్యూరప్ప ఫైర్..
ప్రతిపక్ష పార్టీలు అనర్హత గురైన కాంగ్రెస్-జేడీ(ఎస్) ఎమ్మెల్యేలకు డిసెంబర్ 5న 15 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల కోసం టికెట్లు ఇవ్వడంపై యడ్యూరప్ప హుబ్లి సమావేశంలో పలువురు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్యూరప్పకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఓ ఆడియో క్లిప్లో.. ఆ అనర్హత గురైన రెబల్ కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలను సంకీర్ణ ప్రభుత్వ చివరి రోజుల్లో ముంబైలో ఉంచడం జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దీన్ని పర్యవేక్షిస్తారని యడ్యూరప్ప చెప్పినట్లు ఆ ఆడియో క్లిప్లో ఉంది.
యడ్యూరప్ప, అమిత్ షాను తప్పించాలంటూ.. కాంగ్రెస్
బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు తాము పడిన కష్టాన్ని మర్చిపోయారా? అని పార్టీ నేతలపై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో నాయకులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. ఈ ఆడియో టేప్ విడుదలవడంతో సిద్ధరామమయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ను మెమోరాండం అందజేసింది. ఆయన ద్వారా రాష్ట్రపతిని.. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అంతేగాక, అమిత్ షాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.