అప్పుడు, ఇప్పుడు, యడియూరప్పకు ఎప్పుడు ప్రజామోదం లేదు : సిద్ధరామయ్య
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. అంతకుముందు బలపరీక్షపై జరిగిన చర్చలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య, మాజీ సీఎం కుమారస్వామి యడియూరప్పపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి, యడియూరప్పకు ఎప్పుడూ ప్రజల మద్దతు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ సీఎం కుమారస్వామి .. తన 14 నెలల పాలనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకున్నానని స్పష్టంచేశారు. యడియూరప్ప లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, రికార్డులో కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజామోదం లేదు
బలపరీక్ష చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య.. యడియూరప్పపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు యడియూరప్పకు ప్రజల మద్దతు ఎన్నడూ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో బీజేపీ గెలిచింది, కానీ అప్పుడు జేడీఎస్తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2018లో బీజేపీ విజయం సాధించింది. కానీ అధికారం చేపట్టేందుకు ఆమడదూరంలో నిలిచిపోయింది. వారికి ప్రజల మద్దతు అప్పుుడు, ఇప్పుడు, ఎన్నడూ లేదని విమర్శించారు. మీరు ప్రమాణం చేసే సమయంలో సభలో 222 మంది సభ్యులు ఏనాడైనా ఉన్నారా అని ప్రవ్నించారు. గత ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానీ .. బీజేపీ 105 మంది ఎమ్మెల్యేల వద్ద ఆగిపోయింది. అప్పుడు ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసి .. దొడ్డిదారిన పగ్గాలు చేపట్టిందని విమర్శించారు.
శాశ్వతం కాదు
యడియూరప్ప అధికారంలోకి రావొచ్చు ఇబ్బంది లేదు. సీఎం పదవీ చేపట్టొచ్చు .. కానీ అతను సుస్థిర ప్రభుత్వం ఎప్పుడూ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తను అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ఎందుకంటే యడియూరప్ప ప్రభుత్వ నియామకం రాజ్యాంగ విరుద్ధం, అనైతికమని స్పష్టంచేశారు. తర్వాత మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి .. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నించి .. సఫలీకృతమైందని పేర్కొన్నారు. తన 14 నెలల పాలానాకాలం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానం చెప్పానని గుర్తుచేశారు. తమ పనిని ప్రజలు గుర్తిస్తారని అభిప్రాయపడ్డారు.
అనైతిక చర్యలు
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని యడియూరప్ప గుర్తుంచుకోవాలన్నారు కుమారస్వామి. అదీ ప్రధాని మోడీ, జేపీ నడ్డాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. సభలో మీ సంఖ్య 105 అది 100కి తగ్గిపోవచ్చు కూడా పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నందుకు ధన్యవాదాలు.. ఆ విషయంలో మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు కుమారస్వామి. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనైతిక రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని విమర్శించారు.