యడియూరప్ప తప్పిన ముహూర్తం: ఇది కూడా ముణ్నాళ్ల ముచ్చట కాదు కదా!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడియూరప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:32 నిమిషాలకు గవర్నర్ వజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా యడియూరప్ప ప్రమాణం చేశారు. అక్కడి దాకా బాగానే ఉంది. సమయం వద్దే చిక్కొచ్చి పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. యడియూరప్ప ఈ సాయంత్రం 6:07 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. యడియూరప్ప బలంగా విశ్వసించే జ్యోతిష్యులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. దీని కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. యడియూరప్ప కూడా 6 గంటలకు ముందే రాజ్భవన్కు చేరుకున్నారు. అయినప్పటికీ- గవర్నర్ రాక ఆలస్యమైంది.
నిర్దేశిత సమయం దాటి పోయినప్పటికీ.. గవర్నర్ వేదిక వద్దకు చేరుకోలేదు. దీనితో వేదిక ఎదురుగా ముందు వరుసలో కూర్చున్న యడియూరప్ప కాస్త ఆందోళనగా కనిపించారు. పదే పదే చేతి గడియారాన్ని చూస్తూ గడిపారు. ఆయన పక్కనే కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ ఆయనతో మాట్లాడటం కనిపించింది. కేంద్రమంత్రి, దివంగత అనంతకుమార్ కుమారుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య వచ్చి తొలుత యడియూరప్పకు, ఆ తరువాత ఎస్ఎం కృష్ణకు పాద నమస్కారం చేశారు. అప్పుడు కూడా యడియూరప్ప ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం సరిగ్గా 6:28 నిమిషాలకు గవర్నర్ వేదిక మీదికి వచ్చారు. ఆ వెంటనే- యడియూరప్ప వేదికపైకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ఆరంభించేటప్పటికి సమయం 6:32 నిమిషాలైంది.
నిజానికి- యడియూరప్పకు జ్యోతిష్యులపై నమ్మకం అధికం. పూజలు, పునస్కారాలు చేయనిదే ఆయన అడుగు బయట పెట్టరు. అలాంటిది- నాలుగో సారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముహూర్తం తప్పడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే ఆందోళన అప్పుడే మొదలైంది కూడా. తొలిసారిగా ప్రమాణం చేసిన సమయంలో ఏడురోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. రెండో దఫా మూడేళ్లకు పైగా కొనసాగినప్పటికీ.. పూర్తికాలం పదవిని అనుభవించలేకపోయారు. మూడోసారి మూడురోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యడియూరప్ప నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నిర్ణయించిన ముహూర్తం తప్పిపోవడం వల్ల ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.