ఆమె మంత్రి పదవి కోసం యత్నించిన యడ్యూరప్పకు భంగపాటే మిగిలింది
ఆమె పేరు కర్నాటక రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు. ఆమె ఏదైనా కోరిందంటే యెడ్డీ కాదనే ప్రసక్తే లేదు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమై పోయి ఉండాలి. ఆమె బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే.
యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభా
శోభా కరంద్లాజే... కర్నాటక రాజకీయాల్లో వినిపించే పేరు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరికైనా ఏదైనా పనిపడితే చాలు ముందుగా శోభా కరంద్లాజేను కలిసేవారు. ఎందుకంటే యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభా. యడ్యూరప్పకు ఆమె ఎంత చెబితే అంతే. సార్వత్రిక ఎన్నికల్లో శోభా ఉడిపి - చిక్కమంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ సారి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. యడ్యూరప్పతో కూడా రికమెండ్ చేయించారు. కానీ ఆమెకు మంత్రి పదవి చేజారింది.
శోభా మంత్రి పదవి కోసం యడ్యూరప్ప లాబీయింగ్
ఇక శోభాకు కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించాలని కర్నాటక బీజేపీ మహిళా నాయకులు యడ్యూరప్పపై ఒత్తిడి తీసుకొచ్చారు. కర్నాటక నుంచి బీజేపీ తరపున గెలుపొందిన ఏకైక మహిళా శోభా అని చెబుతూ ఆమె మంత్రి పదవి కోసం అధిష్టానంతో లాబీయింగ్ చేయాలని సూచించారు. అయితే పార్టీ అధినాయకత్వం శోభాకు కచ్చితంగా ఉన్నత స్థానం ఇస్తుందని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ కేబినెట్ మంత్రులను ప్రకటించాక శోభా పేరుకనిపించకపోవడంతో ఒక్కసారిగా యెడ్డీ షాక్కు గురయ్యారు.
యడ్యూరప్ప సిఫార్సులను పట్టించుకోని బీజేపీ హైకమాండ్
యడ్యూరప్ప బుధవారం నుంచి ఢిల్లీలో మకాం వేసి శోభాకు మంత్రి పదవి దక్కేలా లాబీయింగ్ చేశారు. శోభా పేరుతో పాటు పీసీ గడ్డిగౌదార్ పేరును కూడా యడ్యూరప్ప సిఫార్సు చేశారు. అయితే ఈ పేరును కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. ఇక దీంతో రాష్ట్ర బీజేపీ శాఖ సూచనలను బీజేపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోవడంలేదనే సంకేతాలు ఇస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన సమయంలో యడ్యూరప్పను సైతం లెక్కలోకి తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అంతకుముందు లోక్సభ టికెట్ కేటాయింపుల్లో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ సూచించిన వారి పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లింది.
మొత్తానికి మలి దఫా కేబినెట్ ఎక్స్పాన్షన్లో శోభాకు మంత్రిగా అవకాశం లభిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.