ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నా, ఆ వీడియోలు వ్యక్తిగతమైనవి: రాధేమా
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయి నుండి తనకు తానే దేవతగా ప్రకటించుకొనే స్థాయికి చేరుకొంది. ముంబైకి మారిన తర్వాత తన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయని రాధేమా చెప్పారు. ఓ జాతీయ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేమా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దైవాంశ సంభూతురాలు.. శివుడికి-భక్తులకి మధ్య సంధానకర్త... పైగా దుర్గా మాత అవతారం ఎత్తారు సుఖ్విందర్ కౌర్. అలియాస్ రాధేమా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రాధేమాగా ఎలా మారింది? ఆరోపణలపై ఆమె స్పందన ఏంటి? సూసైడ్ చేసుకోవాలని ఎందుకనుకుంది? తదితర విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చారు.
పంజాబ్కు చెందిన సుఖ్విందర్ కౌర్ తల్లిదండ్రులు 17 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం చేశారు. మూడేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఆ సమయంలోనే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే కాళ్ల మీద పడి బ్రతిమాలిన కనుకరించలేదని ఆమె చెప్పారు.
ఆ సమయంలో తనకు తెలిసిన దర్జీ పనితో కొంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె తర్వాత ఆధ్యాత్మికం వైపు మళ్లినట్లు చెప్పారు. ముంబైకి మకాం మార్చాక ఆమె పూర్తిగా దైవ ధ్యానంలోనే నిండిపోయిందని రాధేమా చెప్పారు.. అప్పుడే ఆమె చుట్టూ భక్తులు చేరిపోవటం.. అతి తక్కువ సమయంలోనే తన పేరు దశదిశలా వ్యాపించిందన్నారు.
మోడ్రన్ అవతారంలో వేషాధారణ. ఆమె జీవనశైలిపైనే పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, అవేం తనను ఆపలేవని ఆమె అంటున్నారు. ''ఇవన్నీ నా బిడ్డలు ఇచ్చిన బహుమతులు. భక్తి పేరుతో ఆశ్రయించేవారిని కొల్లగొట్టడం నాకు తెలీదు. జీవితంలో దుర్భర జీవితాన్ని గడిపిన నేను ఎంచుకున్న మార్గం సక్రమమైందనే నాకు తెలుసునని రాధేమా అంటున్నారు. ఇదే నా జీవితం. నేను ఇలాగే ఉంటాను. ఈ లోకం కోసం నేను అస్సలు మారను. మిగతా సాధువల్లా నేను కొన్ని భోగాలను పరిత్యజించాను. అవేంటో లోకానికి వివరించాల్సిన అవసరం నాకు లేదు అని ఆమె ఆ ఇంటర్వ్యూలో ప్రకటించారు.
తనపై వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. ముఖ్యంగా ముంబైకి చెందిన ఓ మహిళ గృహ హింస కేసులో రాధే మా పేరును కూడా ప్రస్తావించటం తెలిసిందే. ఆ కుటుంబం తన వీరభక్తులని.. వారి కుటుంబ కలతను పరిష్కరించేందుకే అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు. కానీ, ఆ ఇంటి కోడలు డబ్బు కోసమే తన పేరును కేసులోకి లాగిందని రాధే మా తెలిపారు.
ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ, నా బిడ్డల కోసం ఆలోచించా. నేను పోతే వారిని ఎవరు చూసుకుంటారు. అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు రాధేమా చెప్పారు. అంతేకాదు మానసిక వైద్యుడి పర్యవేక్షణలో కౌన్సిలింగ్ తీసుకున్నట్టు రాధేమా వివరించింది. డాన్సింగ్ వీడియోలపై తనదైన రీతిలో ఆమె స్పందించారు. అవి తన వ్యక్తిగతమని, వాటిని బయటపెట్టి కొందరు పెద్ద తప్పు చేశారని ఆమె చెప్పారు. ఫేక్ స్వామిజీల జాబితాలో తన పేరు ఉండటంపై ఆమె సమాధానమివ్వలేదు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్రశ్నలపై నోరు మెదపలేదు. . తన జీవితం ఓ తెరచిన పుస్తకం అంటూనే.. మధ్యమధ్యలో కంటతడి పెట్టారు. భక్తుల కోసమే తన జీవితమని ప్రకటించారు.