YES Bank Crisis:సంక్షోభాన్ని అధిగమించేందుకు రీకన్స్ట్రక్షన్ స్కీమ్.. రంగంలోకి ఎస్బీఐ..
యెస్ బ్యాంక్ సంక్షోభం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. కస్టమర్ల డబ్బులు ఎక్కడికి పోవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చినప్పటికీ.. ఖాతాదారులను ఆందోళన వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో యెస్ బ్యాంక్ పునరుద్దరణ కోసం ఆర్బీఐ రీకన్స్ట్రక్షన్ స్కీమ్(పునరుద్దరణ ప్రణాళిక)ను ప్రకటించింది. ఇందులో భాగంగా యెస్ బ్యాంకులో పెట్టుబడులకు ఎస్బీఐ సిద్దంగా ఉందని తెలిపింది. దాదాపు 49 శాతం వాటాను కొనుగోలు చేసి ఈక్విటీ క్యాపిటల్లో పంప్ చేసే అవకాశం ఉంది.
Recommended Video
ఎస్బీఐకి ఆర్బీఐ నిబంధనలు
యెస్ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్లకు తగ్గించిన ఆర్బీఐ.. రూ.2 ఫేస్ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను రూ.2400కోట్లకు పెంచింది. దీంతో ఎస్బీఐలో 49శాతం వాటాలు కొనుగోలు చేయనున్న యెస్ బ్యాంక్.. దాదాపు రూ.2400కోట్లు చెల్లించనుంది. అయితే బ్యాంకులో పెట్టుబడులు పెట్టిన తేదీ నుంచి మూడేళ్ల వరకు ఎస్బీఐ తన వాటాను 26 శాతం కంటే తగ్గించుకోరాదని ఆర్బీఐ నిబంధన పెట్టింది.
అలాగే రూ.2 ఫేస్ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.10కి తక్కువ కాకుండా, ప్రీమియం రూ.8కు తగ్గకుండా కొనుగోలు చేయాలన్న నిబంధన తెచ్చింది.
రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ఎందుకోసం..
ఆర్బీఐ తీసుకొచ్చిన పునరుద్దరణ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అన్ని డిపాజిట్ల పూర్తి తిరిగి చెల్లించడం, ఈక్విటీ విలువను తగ్గించడం. అలాగే రూ.10,800 కోట్ల అదనపు టైర్ వన్ బాండ్లను రాతపూర్వకంగా సమకూర్చుకోవడం. గత మేనేజ్మెంట్ నిర్వహణలో యెస్ బ్యాంక్ మూలధన అవసరాలు 2బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే యెస్ బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడికానుందనా దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
యధాతథ స్థితిని కొనసాగించనున్న ఆర్బీఐ
యెస్ బ్యాంక్లో యధాతథ స్థితిని ఆర్బీఐ కొనసాగించనుంది. లావాదేవీలకు సంబంధించిన లెక్కలన్నీ అలాగే కొనసాగనున్నాయి.డిపాజిట్లు, అప్పులు, కస్టమర్ల హక్కులతో పాటు బ్యాంకు రుణదాతల హక్కులు, బాధ్యతల్లో ఎటువంటి మార్పు ఉండదు. కొత్తగా వీటిపై ఎలాంటి నిబంధనలు తీసుకురారు. యెస్ బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు, నియమ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే పునరుద్దరణలో భాగంగా కీలక బాధ్యతల్లో ఉన్న మేనేజర్లను బోర్డు తొలగించే అవకాశం ఉంది. పలుచోట్ల బ్యాంకు కొత్త ఆఫీసులు, బ్రాంచులను తెరిచే అవకాశం కూడా ఉంది.
ఆరుగురు సభ్యులతో బోర్డు..
బ్యాంకింగ్ నిబంధనల చట్టం, 1949లోని సెక్షన్ 36ఏబీ, సబ్ సెక్షన్ (1) ప్రకారం బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్లను నియమించే అధికారం ఆర్బీఐకి ఉంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్ను ప్రస్తుతం యెస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. పునరుద్దరించబడే యెస్ బ్యాంక్ బోర్డులో సీఈఓ, ఎండీ, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సహా ఆరుగురు సభ్యులు ఉండారు. ఇందులో ఎస్బీఐ ఇద్దరు డైరెక్టర్లను నియమించుకునే అవకాశం ఉంది.