ఔను...ఆయన కోడ్ ఉల్లంఘించారు..! ఈసీ సరైన చర్యలు తీసుకోవాలన్న మాయావతి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రతిపక్ష గళాలు మండిపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిని విమర్శించి 24గంటలు గడవక ముందే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. జాతినుద్దేశించి ప్రసంగం పేరిట మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. మిషన్ శక్తి విజయవంతం అవడంతో మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ఇలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మాయావతి మాట్లాడుతూ..''శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లే.. భాజపా నేతలు ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికీ ఎన్నికల సంఘం ముందస్తు అనుమతులు లేకుండా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ మరోసారి కోడ్ను ఉల్లంఘించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం అని మాయావతి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈసీ స్పందించింది. మోదీ చేసిన ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపిని సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా, రాదా? అనే విషయాన్ని తేల్చడానికి డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే దేశభద్రత, విపత్తుల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఎన్నికల నియమావళి పరిధిలోకి రావని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వాటికి ముందస్తు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశాయి. అయితే మోదీ చేసిన ప్రకటనలోని వ్యాఖ్యల పరిశీలనకు ఈసీ కమిటీ ఏర్పాటు చేసిందని, అసలు వివాదం అది కాదని మాయావతి అన్నారు. ఈసీ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాని ప్రసంగించడమే అసలు ఉల్లంఘన అని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈసీ సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు మాయావతి.