Bollywood Drug case: అవును అతను డ్రగ్స్ తీసుకోవడం చూశాం: శ్రద్ధాకపూర్, సారా
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విచారణ మెల్లగా డ్రగ్స్ వైపు మరలింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్లోని డ్రగ్ దందాపై విచారణ చేస్తోంది. నిషేధిత డ్రగ్స్ బాలీవుడ్ ప్రముఖులు తీసుకుంటున్నారని లావాదేవీలు జరుపుతున్నారని విచారణలో తేల్చింది. ఈ డ్రగ్స్ దందాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉండటంతో వారికి నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన దీపికా పదుకోన్, సారా అలీఖాన్ మరియు శ్రద్ధాకపూర్లు శనివారం ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ , టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ను సెప్టెంబర్ 25వ తేదీన విచారణ చేసిన అధికారులు మరిన్ని కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్తో సంబంధమున్న మరికొందరు ప్రముఖుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో విచారణ సందర్భంగా సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లు చాలా విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ షూటింగ్ సమయాల్లో వానిటీ వ్యాన్లో డ్రగ్స్ తీసుకోవడం తాము కళ్లారా చూసినట్లు ఎన్సీబీ అధికారులకు చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక షూటింగ్స్ సమయంలో బ్రేక్ తీసుకున్నప్పుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేవాడని ఇద్దరు హీరోయిన్లు చెప్పారు. పావ్నాలోని సుశాంత్ సింగ్ ఫామ్ హౌజ్ కై పో చేలో జరిగిన పార్టీ వాస్తవమేనని అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది శ్రద్ధా కపూర్. ఇక దీపికా పదుకోన్ కూడా తాను డ్రగ్స్ విషయమై జరిపిన చాటింగ్ నిజమే అని అయితే తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని అధికారులకు వివరించింది. అధికారులు వేసిన ప్రశ్నలకు దీపికా పదుకోన్ పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
ఇక సెప్టెంబర్ 25వ తేదీన అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ను విచారణ చేయగా ఆమె కూడా ఇదే తరహా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తితో తాను డ్రగ్స్ గురించి చాటింగ్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న రకుల్... తాను మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. మరోవైపు డ్రగ్ పెడ్లర్స్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని రకుల్ చెప్పినట్లు సమాచారం. అయితే రకుల్ ప్రీత్ను నాలుగు గంటల పాటు విచారణ చేసిన ఎన్సీబీ అధికారులు అవసరమైతే మరోమారు విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే కేసులో ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితీజ్ రవి ప్రసాద్ను విచారణ చేసిన నార్కోటిక్స్ అధికారులు మరింత సమాచారం అతని దగ్గర నుంచి సేకరించేందుకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి అరెస్టుల పరంపర ప్రారంభమైంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్లతో పాటు మరో 16 మందిని అరెస్టు చేయడం జరిగింది.రియా షోవిక్, మిరండా, సావంత్లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దీపికా ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ మధ్య 2017లో జరిగిన చాట్ ద్వారా బయటపడగా.. సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ల పేర్లు జయ సాహాను విచారణ చేయడంతో ఆమె వీరి పేర్లు బయటపెట్టారు.
మొత్తానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చివరకు ఈ కేసు బాలీవుడ్ డ్రగ్ మాఫియా వరకు తీసుకెళ్లింది. పలువురు ప్రముఖుల పేర్లు డ్రగ్ కేసులో బయటపడటంతో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ వణుకుతున్నారు.