బీహార్ ఎన్నికల సిత్రాలు- నేరస్తులు, వారి భార్యలకే టికెట్లు- అన్ని పార్టీలదీ అదే దారి..
బీహార్ ఎన్నికల్లో గత 15 ఏళ్లుగా తాము శాంతిభద్రతలను అదుపులో ఉంచామని సీఎం నితీశ్ కుమార్ చెప్పుకుంటున్నా ఎన్నికల వేళ పరిస్ధితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ప్రత్యర్ధులపై ఆధిపత్యం కోసం అన్ని పార్టీలు గట్టి అభ్యర్ధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరికి నేరస్తులను, డాన్లను, వారి భార్యలవైపే మొగ్గుచూపాయి. వీరిని బరిలో దించడం ద్వారా ప్రత్యర్ధులను భయభ్రాంతులను చేయడంతో పాటు ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చనేది వాటి ఆలోచన.
బీహార్ : ఆరుగురు సీఎం అభ్యర్థులు... ముగ్గురు సీనియర్లను ఢీకొడుతున్న ముగ్గురు యంగ్&డైనమిక్ నేతలు..
ఈ నెల 28న 71 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న తొలి దశ పోలింగ్లో మొత్తం 353 అభ్యర్ధులు రంగంలో ఉండగా.. వీరిలో 164 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరిపై కిడ్నాప్, హత్య, అత్యాచారం, అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. అయినా పార్టీలకు ఇవేవీ పట్టడం లేదు. ఇలా నేరస్తులకు ఎక్కువగా అవకాశాలు కల్పించిన వారి జాబితాలో ఆర్జేడీ ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత బీజేపీ, లోక్జన్శక్తి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, జేడీయూ ఉన్నాయి.
Recommended Video
ఆర్జేడీ తరఫున మోకమా నుంచి బరిలోకి దిగిన అనంత్సింగ్ అత్యధికంగా 38 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 33 కేసులతో దాణాపూర్ బరిలో ఉన్న మరో ఆర్జేడీ అభ్యర్ధి రిత్లాల్ యాదవ్ రెండో స్ధానంలో ఉన్నారు. వీరి నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉందన్న ప్రచారంతో వీరి భార్యలతోనూ నామినేషన్లు వేయించారు. మరికొందరు అభ్యర్ధులు క్రిమినల్ కేసుల కారణంగా టికెట్లు పొందలేక వారి భార్యలను నేరుగా రంగంలోకి దింపారు. ఇలాంటి వారిలో నవడా నుంచి పోటీ చేస్తున్న విభాదేవి, సందేశ్ స్ధానంలో బరిలో ఉన్న కిరణ్ దేవి ఉన్నారు. జేడీయూ కూడా ఇలాంటి పరిస్ధితుల్లోనే డాన్లు మనోరంజన్ సింగ్ ధుమాల్, అవదేశ్ మండల్, బీందీ యాదవ్ భార్యలను రంగంలోకి దింపింది. జైలుకు వెళ్లి నితీశ్ కేబినెట్లో చోటు కోల్పోయిన మంజూవర్మ మరోసారి బరిలోకి దిగారు. బీజేపీ కూడా ఇదే కోవలోకి వచ్చే అరుణాదేవిని బరిలోకి దింపింది.