తేజ్ భార్య ఐశ్వర్య రాజకీయాల్లోకి వస్తుందా? 'హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది'
పాట్నా: ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్య రాయ్ రాజకీయాల్లోకి రానున్నారా? అనే ప్రచారం బీహార్లో జోరుగా సాగుతోంది. బుధవారం పలు బ్యానర్లలో ఐశ్వర్య ఫోటోలు కనిపించాయి. దీంతో ఆమె కూడా రాజకీయాల్లోకి రావొచ్చుననే ప్రచారం సాగుతోంది.
గురువారం ఆ పార్టీ 22న ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. ఇందుకోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పలు బ్యానర్లలో ఐశ్వర్య ఫోటోలు కనిపించాయి. తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల పెళ్లి ఈ ఏడాది మే 18వ తేదీన జరిగిన విషయం తెలిసిందే.
ఐశ్వర్య నవ్వుతూ ఉన్న ఫోటోలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తేజ్ ప్రతాప్ యాదవ్ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, తేజ్ సోదరి, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి, తేజ్ సతీమణి ఐశ్వర్య ఫోటోలు ఉన్నాయి. ఇందులో ఐశ్వర్య నవ్వుతూ ఉన్నారు.
పలుచోట్ల బ్యానర్లు
లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ఇంటి బయట, బీర్చంద్ పటేల్ మార్గ్లోని పార్టీ కార్యాలయం వద్ద ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఐశ్వర్య ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన చంద్రికా రాయ్ కూతురు.
హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది
మరోవైపు, ఐశ్వర్య రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను పాట్నా కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆమె తల్లి పూర్ణిమా రాయ్ కొట్టిపారేశారు. ఐశ్వర్యకు రెండు నెలల క్రితమే పెళ్లయిందని, వారు హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నారని, గత రాత్రే తాను ఐశ్వర్యతో రబ్రీ దేవితో మాట్లాడానని, ఐశ్వర్యను రాజకీయాల్లో ప్రవేశపెట్టే ఆలోచన వారికేమీ లేదని చెప్పారు.
ఇప్పుడు రాజకీయాల్లోకి రాదు, భవిష్యత్తు చెప్పలేం
ఐశ్వర్య కూడా అందుకు ఇప్పుడు సిద్ధంగా లేదని ఆమె అన్నారు. అందరు కొత్తగా పెళ్లైన అమ్మాయిల్లాగే ఐశ్వర్య కూడా సినిమాలు చూస్తూ, షాపింగ్ చేస్తూ సమయం గడుపుతోందని, తమదీ రాజకీయ కుటుంబమే అయినప్పటికీ మేము ఎప్పుడూ తను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, తేజ్ ప్రతాప్తో పెళ్లి చేస్తున్నప్పుడు కూడా తమకు అలాంటి ఆలోచన లేదన్నారు. పార్టీ పోస్టర్లలో ఉండటం కార్యకర్తల ఉత్సాహమే అన్నారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రావడం లేదని, భవిష్యత్తు చెప్పలేమన్నారు.