వివాదంలో రాందేబ్ బాబా అట్టా నూడుల్స్
న్యూఢిల్లీ: దేశంలో నూడుల్స్ వివాదం కొనసాగుతున్నది. ఇప్పుడు ఇదే నూడుల్స్ వివాదంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చిక్కుకున్నారు. తన సంస్థ పతాంజలి నుంచి విడుదల చేసిన అట్టా నూడుల్స్ కు అనుమతి తీసుకోలేదని బుధవారం అధికారులు తేల్చి చెప్పారు.
ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటి ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోకుండానే రాందేవ్ బాబా నూడుల్స్ మార్కెట్ లోకి విడుదల చేశారని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు నూడుల్స్ కు అనుమతి తీసుకోలేదని, కనీసం రాందేవ్ బాబా అనుమతి కోసం దరఖాస్తూ చెయ్యలేదని చెబుతున్నారు.
అయితే రాందేవ్ బాబా విడుదల చేసిన అట్టా నూడుల్స్ ప్యాకెట్ల మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి పొందినట్లు ఉందని మాకు తెలిసిందని అధికారులు చెప్పారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై అన్ని కోణాలలో దర్యాప్తు చేసి విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.
అయితే ఈ విషయంపై పతాంజలి సంస్థ కానీ, రాందేవ్ బాబా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మ్యాగీ నూడుల్స్ వివాదంలో చిక్కుకున్న తరువాత రాందేవ్ బాబా అట్టా నూడుల్స్ తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తానని ప్రకటించారు. అదే విదంగా మార్కెట్ లోకి నూడుల్స్ విడుదల చేశారు.