యోగాతో అత్యాచారాలు ఆగుతాయి: జోషి, ప్రవక్త ఒక గొప్ప యోగి..
న్యూఢిల్లీ: యోగాతో వ్యాధులతోపాటు మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలు తగ్గిపోతాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తెలిపారు. ఢిల్లీలో ఆదివారం ‘ది అయ్యంగార్ వే యోగా ఫర్ ది న్యూ మిలీనియం' అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజల జీవితాల్లో యోగా ఒక భాగమైనట్లయితే ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార సంఘటనలు తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
‘యోగాతో అత్యాచారాలు పూర్తి ఆగిపోతాయని చెప్పలేను కానీ.. అలాంటి ఘటనలు గణనీయస్థాయిలో తగ్గుతాయి' అని జోషి చెప్పారు. యోగాతో పురుషులు, మహిళల్లో నూతన ఆలోచనా పద్ధతులు ఏర్పడతాయని ఆయన తెలిపారు.
మానవ శరీరం గురించి ఆలోచించే తీరు మారుతుందని జోషి చెప్పారు. ‘బృహత్తర కార్యక్రమాల కోసం ఒక యంత్రంలా పని చేయడానికి ప్రకృతి మనకు శరీరాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ దిశగానే మనం ఆలోచించేలా యోగా ఉపయోగపడుతుంది' అని జోషి వివరించారు.
ముస్లింలు రోజుకు ఐదు సార్లు యోగా చేయాలని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త ఒక గొప్ప యోగి అని మురళీ మనోహర్ జోషి తెలిపారు. దేవుడ్ని ప్రార్థించడం యోగాతో ముడిపడి ఉందని చెప్పారు. యోగాతో సామాజికంగా, ఆర్థికంగా జీవితాలు మెరుగుపడతాయని జోషి చెప్పారు.