
రెండోసారి సీఎంగా యోగి తొలి సంచలన నిర్ణయం: ఆ పథకం పొడిగింపు; నిరుపేదలకు శుభవార్త!!
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది. శుక్రవారం రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నాం: సీఎం యోగి
యూపీ కేబినెట్ మీటింగ్లో ఉచిత రేషన్ పథకాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని నిర్ణయించామని, దీని వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఉచిత రేషన్ పథకం గడువు మార్చితో ముగియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పథకాన్ని పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పేదల సంక్షేమం కోసం బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం: డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్
యూపీలో మూడు నెలల పాటు ఉచిత రేషన్ ఇస్తామని.. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు చేరవేయాలని కొత్త ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ అన్నారు. లక్నోలోని లోక్భవన్లో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు

రెండో సారి సీఎంగా ప్రమాణం చేసిన యోగి, 52మంది మంత్రుల క్యాబినెట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి రెండోసారి శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు, నితీశ్ కుమార్ వంటి మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. యోగి ఆదిత్యనాథ్తో పాటు, 52 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి నాయకత్వం మంత్రుల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్య మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ దినేష్ శర్మ స్థానంలో బ్రాహ్మణ నాయకుడు బ్రజేష్ పాఠక్ కు అవకాశం కల్పించారు.

రెండోసారి యోగి పాలనా పగ్గాలు... దూకుడు చూపిస్తున్న యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. యోగి ఆదిత్యనాథ్ తన పార్టీకి భారీ విజయాన్ని అందించారు. రాష్ట్రంలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డులను తిరగరాశారు. ఇక మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో దూకుడు చూపించనున్నారు. 2024ఎన్నికలు లక్ష్యంగా దూసుకుపోనున్నారు.