భయం లేదు: తెగించిన యోగి ఆదిత్యనాథ్
నోయిడా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా విషయంలో ఉన్న మూఢ నమ్మకాన్ని బ్రేక్ చేశారు. నోయిడా విషయంలో గత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఉన్న భయాలను బేఖాతరు చేశారు.
గత 29 ఏళ్లుగా ఆ మూఢ నమ్మకానికి ఆయన తెరదించారు. మాయావతి మినహా పదవిలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా గత 29 ఏళ్లలో నోయిడాలో కాలు పెట్టలేదు. వారి నమ్మకాలను తోసిరాజంటూ యోగి శనివారంనాడు నోయిడాలో కాలు పెట్టారు.
మోడీ వస్తుండడంతో యోగి...
ఢిల్లీ మోట్రో ఫస్ట్ ఇంటర్ఛేంజ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. మోడీ పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు యోగి ఆదిత్యనాథ్ నోయిడా బయలు వచ్చారు.
అభివృద్ధి విషయంలో తావు లేదు.
అభివృద్ధి విషయంలో మూఢవిశ్వాసాలకు స్థానం లేదని, రాష్ట్ర ప్రజల చిరకాలం వాంఛను నెరవేర్చేందుకు యోగి ఆదిత్యనాథ్ నోయిడా వెళ్లారని ఉత్తరప్రదేశ్ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ చెప్పారు.
1998 జూన్ తర్వాత...
1988 జూన్ తర్వాత అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు మాయావతి మినహా నోయిడాకు వెళ్లేందుకు భయపడ్డారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వీరబహదూర్ సింగ్ నోయిడాకు వెళ్లి తిరిగి వచ్చారు.వెంటనే పదవి నుంచి వైదొలగాల్సిందిగా ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
మాయావతి సాహసం చేశారు..
బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకసారి నోయిడా వెళ్లారు. 2007 నుంచి 2012 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి నోయిడాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె మళ్లీ అధికారంలోకి రాలేదు. యోగి ఆదిత్యనాథ్ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ ఏ సందర్భంలోనూ నోయిడాలో కాలు పెట్టలేదు.
అఖిలేష్ దూరంగానే ఉండిపోయారు..
2013లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ సదస్సు నోయిడాలో జరిగింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా ఆ సదస్సులో పాల్గొన్నారు. అఖిలేష్ మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. యమునా ఎక్స్ప్రెస్ వే సహా రూ.3.3000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను అఖిలేష్ యాదవ్ లక్నో నుంచే వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.
రాజ్నాథ్ సింగ్ ఇలా చేశారు..
అఖిలేష్కు ముందు ముఖ్యమంత్రులుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, కల్యాణ్ సింగ్, నోయిడాకు దూరంగానే ఉంటూ వచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ నోయిడాను, ఢిల్లీని కలిపే ఫ్లై ఓవర్ లింకింగ్ను ప్రారంభించారు. అయితే, సరిహద్దుకు ఢిల్లీ వైపు ఉండి ఆయన దాన్ని ప్రారంభించారు.