సాయంత్రం యోగీ కేబినెట్ విస్తరణ- 8 మంది కొత్తమంత్రులు-జితిన్ ప్రసాద, బేబి రాణీ మౌర్య సహా
యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఇవాళ కేబినెట్ విస్తరణ చేపట్టబోతోంది. సాయంత్రం రాజ్ భవన్ లో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం యోగీ తన కేబినెట్ ను విస్తరించబోతున్నారు. ఇందులో ఏడుగురు కొత్త మంత్రులకు చోటు లభించవచ్చని తెలుస్తోంది.
వచ్చే ఏడాదికి ఐదేళ్ల పాలన పూర్తిచేసుకోబోతున్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం... ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా విషయంలో యోగీ సర్కార్ నిర్లక్ష్యంతో పాటు మతపరమైన విషయాల్ని తెరపైకి తెచ్చి మైనార్టీలను టార్గెట్ చేయడంతో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. పరిస్ధితిని గమనించిన బీజేపీ అధిష్టానం ఓ దశలో సీఎంగా యోగీ స్ధానంలో మరో నేతకు అవకాశం ఇవ్వాలని కూడా భావించింది. అయితే ఆరెస్సెస్ మద్దతుతో పాటు స్ధానికంగా పాపులారిటీ ఉన్న యోగీని మార్చేందుకు సాహసించలేకపోయింది. దీంతో కేబినెట్ విస్తరణకు పచ్చజెండా ఊపింది.
అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్ విస్తరణకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం తన కేబినెట్ ప్రక్షాళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కనీసం ఏడుగురు మంత్రుల్ని మార్చేందుకు యోగీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానంలో కొత్తగా మరో ఏడుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేయబోతున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదతో పాటు సంజయ్ నిషాద్ వంటి నేతలకు అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు దక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యోగీ కేబినెట్లో చోటు దక్కించుకోనున్న వారిలో జితిన్ ప్రసాద, సంజయ్ నిషాద్ తో పాటు బేబీ రాణి మౌర్య, సంగీతా బల్వంత్, తేజ్ పాల్ నగర్, ఛత్రపాల్ గంగ్వార్, సంజయ్ గోండ్, ధర్మవీర్ ప్రజాప్రతి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బేబి రాణి మౌర్య తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ మంత్రి పదవి తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని సీఎం యోగీ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కులాల వారికి కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారు.