గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గోరక్పూర్, పుల్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఆయన ఓటమిని హుందాగా స్వీకరించారు. ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు. ఇది మాకు గుణపాఠమని చెప్పారు. రెండు పార్టీల కలయికను తాము తక్కువగా అంచనా వేశామన్నారు. తమ అతివిశ్వాసం కొంపముంచిందన్నారు.
ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వెళ్తున్న భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలలో మాత్రం షాకులు తగులుతున్నాయి. నిన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో ఉప ఎన్నికల్లో కమలంకు ఎదురుదెబ్బ తగిలింది.
సంచలనం: యోగి-మోడీలను ఒంటరిగా ఎదుర్కోలేక ఒక్కటవుతున్న మాయా-అఖిలేష్
ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పలుచోట్ల వరుసగా బీజేపీ పాలన కారణంగా ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆ పార్టీ అధిష్టానం ముఖ్యంగా రాష్ట్రాలపై దృష్టి సారించడమే కారణమని చెబుతున్నారు.
రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
ముఖ్యంగా యూపీలో లోకసభ ఎన్నికల్లో డెబ్బైకి పైగా ఎంపీ స్థానాలు గెలిచి, అ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఇక్కడ బీజేపీకి ఎదురుగాలి చర్చనీయాంశంగా మారింది. గోరఖ్పూర్, పుల్పూర్ లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎస్పీ బీజేపీని దెబ్బకొట్టింది.
బీజేపీని ఎదుర్కొనేందుకు మిత్రులైన రాజకీయ శత్రువులు
దీనికి పలు కారణాలు ఉన్నాయి. యోగి ప్రభుత్వంపై విపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా బురదజల్లాయని అంటున్నారు. అంతకంటే అసలైన కారణం దశాబ్దాలుగా విపక్షాలైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఒక్కటవడం ముఖ్య కారణం.
బీజేపీ వరుస గెలుపులు
దాదాపు గత రెండు దశాబ్దాలుగా యూపీలో అయితే ఎస్పీ లేదంటే బీఎస్పీ అధికారంలో ఉంటూ వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ ఇటీవల అధికారంలోకి వచ్చింది. దానికి తోడు మోడీ నేతృత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది. దీనిని విపక్షాలు జీర్ణించుకోవడం లేదని అంటున్నారు.
బీహార్ ప్లాన్ ఉత్తర ప్రదేశ్లో
అందుకే, యూపీలో దశాబ్దాల రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, కేవలం బీజేపీ లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ కలిశాయి. గతంలో బీహార్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పాతికేళ్ల రాజకీయ శతృత్వాన్ని పక్కన పెట్టి ఆర్జేడీ, జేడీయులు కలిశాయి. అక్కడ ఆ ప్లాన్ ఫలప్రదమైంది. దీంతో ఇక్కడ కూz ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఏకమయ్యాయి.
ఇప్పుడు కలిశాయి కానీ
కమలం పార్టీని ఎదుర్కొనేందుకు రాజకీయ కారణాలతో ఎస్పీ, బీఎస్పీ ఏకమవడం పక్కన పెడితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోను ఇలాగే కలిసి పని చేస్తాయా అనే చర్చ సాగుతోంది. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ పరిస్థితి వేరు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు వేరు. బీజేపీని ఓడించేందుకు అధికారమే పరమావధిగా భావించే ఆ రెండు పార్టీలు కలిసే ముందుకు సాగుతాయా అనేది ప్రశ్నే అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీని ఎదుర్కోలేక
ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని ఎస్పీ, బీఎస్పీలు గెలిచే పరిస్థితి లేదని, అందుకే ఎస్పీకి బీఎస్పీ మద్దతిచ్చిందని, అది కూడా ఉప ఎన్నికలు అని గుర్తు చేస్తున్నారు. ఇది బీజేపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఏ మేరకు ఉపయోగపడతాయో గానీ వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు అధికారంపై మమకారం పక్కన పెట్టి బీజేపీని ఎదుర్కొంటారా అనేది చూడాలని అంటున్నారు. ప్రస్తుతానికి ఇరు పార్టీలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నాయి.