అవినీతి వల్లే ఓడిపోయాం: యోగికి షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
లక్నో: కైరానా ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఇటీవల యూపీలో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి పాలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే శ్యాం ప్రకాశ్ బహిరంగంగానే సీఎం యోగిపై విమర్శలను ఎక్కుపెట్టారు.
సీఎం యోగిని విమర్శిస్తూ వ్యంగ్యంగా ఉన్న ఒక గేయాన్ని ఫేస్బుక్లో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అవినీతి కారణంగానే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని శ్యాంప్రకాశ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దాని కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే శ్యాం ప్రకాశ్ తెలిపారు.
ఇది ఇలావుంటే, మరో శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ కూడా యూపీప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అవినీతి అధికారులు రాష్ట్రంలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, 2019 ఎన్నికలు వస్తోన్న తరుణంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి మంచి సందేశమని వ్యాఖ్యానించారు.
Officers are corrupt. Farmers aren't happy with govt. There are several reasons behind BJP's loss. I've nothing against govt, officers are at fault. Corruption, as compared to last govt, is on a rise. That's the reason of my resentment: Shyam Prakash, BJP MLA on his Facebook post pic.twitter.com/w3lOZhFxyv
— ANI UP (@ANINewsUP) June 1, 2018
కాగా, సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గోరఖ్ఫూర్, పూల్పూర్తో సహా నాలుగు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం గమనార్హం. తాజాగా నూర్పూర్, కైరానా స్థానాలను కూడా బీజేపీ కోల్పోయింది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు ప్రాంతాల్లోనూ సీఎం యోగినే స్వయంగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, విపక్షాలన్నీ కలిసి ఒక అభ్యర్థినే నెలబెట్టడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా తెలుస్తోంది.