హనుమంతుడు దళితుడు: సీఎంకు లీగల్ నోటీసులు, రాముడి కోసం ఏకం చేశారు, మనం చేద్దాం !
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రశ్ కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్న యోగి ఆదిత్యనాథ్ కు రాజస్థాన్ కు చెందిన రాజస్థాన్ సర్వ్ బ్రహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా లీగల్ నోటీసులు ఇచ్చారు. హనుమంతుడు (ఆంజనేయస్వామి) దళితుడు, దేశం కోసం అందర్నీ ఏకం చేశారు అంటూ బహింరగ సభలో చెప్పిన యోగి ఆదిత్యనాథ్ బహింరగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు.
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా మాలఖేడ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ఈ సందర్బంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ హనుమంతుడు అడవిలో జీవించేవాడని, ఆయన నిరుపేద దళితుడని వివరించారు.
రాముడి ఆకాంక్ష మేరకు అడవి నుంచి బయటకు వచ్చిన హనుమంతుడు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర భారతేశంలోని సమాజాన్ని ఏకం చెయ్యడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారని, అదే రాముడి ఆకాంక్ష అని, ఇప్పుడు మనం అదే చేద్దామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
రాజస్థాన్ ప్రజలు అందరూ రామ భక్తులకే ఓటు వెయ్యాలని, రావణులకు కాదు అని యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో అన్నారు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశారు. హనుమంతుడు దళితుడు అని చెప్పినందుకు మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సురేష్ మిశ్రా నోటీసులు జారీ చేశారు.