యోగి ఆదిత్యనాథ్ మరో అనూహ్య నిర్ణయం: కుంభమేలాలోగా అలహాబాద్ పేరు మార్పు!
లక్నో: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 2019 కుంభమేళకు ముందే అలహాబాద్ పేరును మార్చాలని భావిస్తున్నారు.
పవిత్రమైన కుంభమేళా జరిగే అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చాలని భావిస్తున్నారు. ఈ వార్తలపై యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయించుకుందని చెప్పారు.
అలహాబాద్ వద్ద పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతిలు కలుస్తాయి. ఈ ప్రాంతాన్ని పురాతన కాలం నుంచి ప్రయాగ్గా పిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
పన్నెండేళ్లకు ఓసారి జరిగే కుంభమేళాలో ఎంతోమంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. 2019లో కుంభమేళా జరగనుంది. గతంలో చాలామంది అఖారాలు, సాధువులు యోగిని కలిసి అలహాబాద్ పేరును మార్చాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఆలోగా పేరు మార్చనున్నారు.