ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహం.. అయోధ్యలో నిర్మించాలని యూపీ సర్కారు నిర్ణయం..
అయోధ్య : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాముని జన్మస్థలమైన అయోధ్యలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గుజరాత్లోని 183 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా ఈ విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండనుంది.
251మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం
అయోధ్యలో 100 ఎకరాల స్థలంలో రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 251 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకున్న నిపుణుల సాయం తీసుకోనుంది. అయోధ్య సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన సీఎం యోగి అందులో భాగంగానే రాముని విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
స్వయంగా పర్యవేక్షించనున్న ముఖ్యమంత్రి
భక్తితో పాటు ఆహ్లాదాన్ని పంచేలా 100ఎకరాల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. టూరిస్టులను ఆకట్టుకునేలా డిజిటల్ మ్యూజియం, లైబ్రరీ, ఫుడ్ ప్లాజా ఏర్పాటుతో పాటు ల్యాండ్ స్కేపింగ్, అధునాతన పార్కింగ్ సదుపాలని కల్పించనుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ట్రస్ట్ ఆలయ నగర అభివృద్ధి ప్రణాళికలను పర్యవేక్షించనుంది.
స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు
విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టు , బిడ్డింగ్, నిర్మాణ పనుల కోసం ప్రత్యేకంగా స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించింది. సైట్ సర్వే, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కోసం ఐఐటీ కాన్పూర్, నాగ్పూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాయం తీసుకోనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో నిర్మించనున్న రాముని విగ్రహానికి సంబంధించి చెక్కతో చేసిన నమూనాను ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే పెద్ద విగ్రహం
అయోధ్యలో నిర్మించనున్న రాముని విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా గుర్తింపు పొందనుంది. అమెరికా న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు కాగా... ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం 137.2 మీటర్లు, గుజరాత్లోని సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 183 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇక ముంబైలో 212 మీటర్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కన్నా అయోధ్యలో రాముని విగ్రహం ఎత్తు 39 మీటర్లు ఎక్కువ కావడం విశేషం.