ఇన్ని సెలవులైతే పనెప్పుడూ!, యోగి దెబ్బతో ఆ 15సెలవులు రద్దు..
మొత్తం 42సెలవుల్లో నుంచి 15సెలవులను రద్దు చేసి 27కు పరిమితం చేశారు. సెలవుల జాబితానే ఇంత పెద్దగా ఉంటే.. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనెప్పుడు జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న 42 ప్రభుత్వ సెలవుల విధానానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కోత పెట్టారు. మొత్తం 42సెలవుల్లో నుంచి 15సెలవులను రద్దు చేసి 27కు పరిమితం చేశారు. సెలవుల జాబితానే ఇంత పెద్దగా ఉంటే.. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనెప్పుడు జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా కేబినెట్ నిర్ణయం మేరకు చాలావరకు ప్రముఖుల వర్థంతులు, జయంతులకు సెలవులను రద్దు చేశారు. అంతేకాదు, పని విషయంలోను ఉద్యోగులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. రోజుకు 18-20గం. పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వారు చూసుకోవాలని సీఎం యోగి ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా, ఏప్రిల్14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవుల రద్దు అంశాన్ని యోగి సూచనప్రాయంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. అంబేడ్కర్ లాంటి మహానీయుల వర్దంతి నాడు పిల్లలకు ఆయన గురించి బోధించాల్సింది పోయి సెలవు ఇవ్వడం సరికాదని ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆరోజు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి వారి జీవితం గురించి బోధించాలన్నారు.
ఇకపోతే శుభ్రత విషయంలోను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి. ప్రతీ కార్యాలయం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలన్నారు. రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలోనే బయోమెట్రిక్ పద్దతిని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఉన్న సెలవులను రద్దు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశే కావడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3పబ్లిక్ హాలిడేలు ఉంటే సరిపోతుందని, లేదా కనీసం వాటిని 17కు తగ్గించాలని వేతన కమిషన్స్ సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నాయి. అయితే ఉద్యోగ సంఘాల అభ్యంతరంతో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.