యోగి వార్నింగ్: నేనో పని రాక్షసుడిని.. చెప్పినట్లు నడుచుకోకుంటే ఇంటికే!
రోజూ 18 నుంచి 20 గంటల పాటు ఖచ్చితంగా పని చేయాల్సిందేనని, అలా కుదరదని చెప్పే ఉద్యోగులు రాజీనామాలు సమర్పించి వెళ్లిపోవాలని యోగి గట్టిగా హెచ్చరించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడైన పాలనతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ముఖ్యంగా పని విషయంలో ఏమాత్రం అలసత్వానికి తావు ఇవ్వవద్దని అధికారులకు ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వోద్యోగం అనగానే తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు.. ఏం చేసినా చెల్లుతుంది అనే తీరుతో వ్యవహరించే అధికారులకు ఇకనుంచి మూడినట్లే అని ఆయన హెచ్చరిస్తున్నారు.
తాజాగా యూపీ అధికారులందరికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పని విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తానో పనిరాక్షసుడినని, అధికారులూ అలాగే పని చేయాలనుకుంటానని, లేనిపక్షంలో వారికి ఇక్కడ స్థానం ఉండదని తేల్చి చెప్పారు. రోజూ 18 నుంచి 20 గంటల పాటు ఖచ్చితంగా పని చేయాల్సిందేనని, అలా కుదరదని చెప్పే ఉద్యోగులు రాజీనామాలు సమర్పించి వెళ్లిపోవాలని యోగి గట్టిగా హెచ్చరించారు.
పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని అధికారులకు యోగి సూచించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే మంత్రి స్థానంలో ఉన్నవారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల హామిలను నెరవేర్చడం తన తొలి కర్తవ్యమని, ప్రభుత్వ పనితీరులో లోపముంటే దృష్టికి తీసుకురావాలే తప్ప, ప్రభుత్వ కార్యకలాపాల్లో వేలు పెడితే సహించేది లేదని పార్టీ నేతలను సైతం మందలించారు.