ఆ సీఎం రాజీనామా చేయాల్సిందే...ప్రధానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల లేఖ
ఉత్తరప్రదేశ్ బులంద్షెహర్లో చోటుచేసుకున్న అల్లర్లను నియంత్రించడంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విఫలమయ్యారని పేర్కొంటూ వెంటనే ఆయన రాజీనామా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి 82 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బలేఖ రాశారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రమాణ స్వీకారం చేసిన యోగీ ఆదిత్యనాథ్ అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. డిసెంబర్ 3వ తేదీన గోవధ జరిగిందని ఓ వర్గం ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆ తర్వాత హింస చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో స్యానా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. మరో వ్యక్తి 22 ఏళ్ల సుమిత్ సింగ్.
యూపీలో యదేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు
భారతదేశంలోని అతి పెద్ద జనాభా కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తర్ ప్రదేశ్లో యదేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, మానవత్వం, సామాజిక న్యాయం ఇక్కడ తొక్కివేయబడుతున్నాయని ఆరోపించారు మాజీ ప్రభుత్వం అధికారులు. ఇక్కడ ముఖ్యమంత్రే ఒక మతాధిపతిగా వ్యవహరించడం చాలా దారుణం అని లేఖలో పేర్కొన్నారు. ఛీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చట్టం అమలయ్యేలా చూడాలి తప్పితే రాజకీయనాయకులకు కొమ్ము కాయకూడదని లేఖ ద్వారా గుర్తు చేస్తున్నట్లు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
బులంద్ షెహర్ అల్లర్లను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి
అలహాబాద్ హైకోర్టు బులంద్షెహర్ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని మాజీ అధికారులు డిమాండ్ చేశారు. అంతేకాదు ఘటనపై జ్యుడిషియల్ విచారణ వేయాలని కోరారు. దేశ పౌరులు కూడా హింసావాద రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సామూహిక హింస, పోలీసు అధికారుల మృతి, గోవుపై రాజకీయాలు గతంలో కూడా ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయని గుర్తుచేసిన మాజీ అధికారులు బులంద్ షెహర్ ఘటన మాత్రం దీన్ని మరో స్థాయికి తీసుకువెళ్లిందని మండిపడ్డారు అధికారులు. బులంద్ షెహర్ ఘటనతో ముస్లిం మైనార్టీలు భయంతోనే బతకాలనే సంకేతాలను ప్రభుత్వం పంపుతోందని మాజీ అధికారులు ధ్వజమెత్తారు.
మనిషిని చంపిన వారిని వదిలేసి గోవును చంపారంటూ అరెస్టులా..?
సుబోధ్ కుమార్ సింగ్పై హిందూ వ్యతిరేకి అనే ముద్రవేసి ఆయన్ను బదిలీ చేసింది ప్రభుత్వం. అల్లర్లలో ఆయన మరణిస్తే అది పొరపాటున జరిగిందని ప్రభుత్వం మౌనం వహించడం సహించరానిదని పేర్కొన్నారు. మనిషిని చంపిన వారిని వదిలేసి గోవధకు పాల్పడ్డారంటూ పలువురిని అరెస్టు చేయడం శోచనీయమన్నారు. వారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ వారిని అరెస్టు చేశారని మాజీ అధికారులు మండిపడ్డారు. సుబోధ్ కుమార్ సింగ్ది కచ్చితంగా హత్యే అని వారు అన్నారు. రాజ్యాంగ గ్రంథాన్నే తాను పవిత్రంగా భావిస్తునానని చెప్పే ప్రధాని మోడీ... తానే యూపీ సీఎంగా ఎంపిక చేసిన యోగీ ఆదిత్యనాథ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు.
2017లో ఈ రిటైర్డ్ సివిల్ అధికారుల బృందం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఘటనపై వీరు స్పందించారు లేఖలు రాశారు. ఉన్నావ్ ఘటన, కతువా అత్యాచార ఘటన, భీమా కోరేగావ్ అల్లర్లలో ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్టులపై ప్రధాని మోడీకి గత 18 నెలల్లో 9 లేఖలు రాసినట్లు తెలిపారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా రాజ్యాంగ విలువలను కాలరాసినట్లే అని అభిప్రాయపడుతున్నారు.