ఓబీసీలను ఎస్సీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం: కేంద్రం
న్యూఢిల్లీ: 17 ఓబీసీ వర్గాల వారికి ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయడం రాజ్యాంగబద్దమైనది కాదని సర్టిఫికేట్ల జారీని వెంటనే నిలిపివేయాలని యోగీ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. కేంద్ర సామాజిక న్యాయం మరి సాధికారిత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ రాజ్యసభలో మాట్లాడుతూ యూపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఓబీసీలను ఎస్సీ సామాజిక వర్గంలో కలపాలన్న నిర్ణయం పార్లమెంటు చేస్తుందని యోగీ సర్కార్ నిబంధనలను పాటించాలని అన్నారు.
2017లో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గెహ్లాట్ సభలో గుర్తుచేశారు. జూన్ 24న 17 ఓబీసీ కులాలను ఎస్సీలుగా మార్పు చేసి కులధృవీకరణ పత్రాలు అందజేయాలని యోగీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కష్యప్, రాజ్భర్, ధీవార్, బింద్, కుమ్హార్, కాహర్, కేవత్, నిషద్, భార్, మల్లా, ప్రజాపతి, ధీమార్, బాథం, తుర్హ, గోదియా, మాంజీ, మచువాకు చెందిన ఓబీసీ కులాలను ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చాలని యోగీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎస్సీ సామాజిక వర్గం భగ్గుమంది. అంతేకాదు బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా యోగీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అది రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.ఎస్సీ జాబితాను మార్పులు చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీలుగా గుర్తిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేయాలని తమకు ఆదేశాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఓబీసీలోని ఈ కులాలకు చెందిన వారు ఆర్థికంగాను సామాజికంగాను వెనకబడి ఉన్నారన్న అభిప్రాయంతోనే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అధికారులు తెలిపారు. వారిని ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చడంతో వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయని దీంతో వారు కొంత అభివృద్ధి చెందుతారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కొత్తగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేరిస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని ఎస్సీ సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమకు రావాల్సిన ఉద్యోగాలు ఇతర ప్రభుత్వం పథకాలకు గండి పడుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.