జైల్లో ఉండటమే ఇష్టమేమో: సుబ్రతా రాయ్పై సుప్రీం
న్యూఢిల్లీ: మానవతా దృక్పథంతో తనను విడుదల చేయాలన్న సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. డిపాజిటర్ల సొమ్ము తిరిగి చెల్లించే కేసుకు సంబంధించి జైలు జీవితం గడుపుతున్న సుబ్రతా రాయ్కి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది.
సోమవారం జరిగిన విచారణలో భాగంగా ‘మానవతా దృక్పథంతో సుబ్రతా రాయ్ని విడిచిపెట్టాలి' అని ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్.. కోర్టు బెంచ్ను కోరారు. కాగా, సుబ్రతా రాయ్ అభ్యర్థనను తిరస్కరించిన టీఎస్ ఠాకూర్ నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
‘క్లిష్టమైన విషయమేమిటంటే.. రాయ్ తన వద్ద రూ.1.85 లక్షల కోట్ల ఆస్తి ఉందటున్నారు. అందులో కేవలం 20 శాతానికి సమానమైన సొమ్ము జమచేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇంత ఆస్తి ఉండికూడా జైల్లో మగ్గుతూ ఆయన తన వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేస్తున్నాడే తప్ప ఆస్తులను వదులుకోవట్లేదు. అంటే ఆయన కావాలనే జైల్లో ఉంటున్నారు' అని చురక అంటించింది.
డిపాజిటర్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు సహారా గ్రూపు వద్ద సరిపడా ఆస్తులున్నాయంటూ రాయ్ గతంలో సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నారు.
అప్పట్లో రాయ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాజా పిటిషన్పై కోర్టు బెంచ్ పై విధంగా స్పందించింది. ఒకవేళ బెయిల్ ఇచ్చినా డిపాజిటర్ల సొమ్ము పూర్తిగా చెల్లించాలన్న ఆదేశాల కత్తి సుబ్రతా మెడపై వేలాడుతూనే ఉంటుందని పేర్కొంది.