ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లు
న్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ .. మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మోడీ.
ఓట్ ఆఫ్ థాంక్స్ ..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదుల తెలిపే తీర్మానంపై ఒడిశా ఎంపీ ప్రతాప్ సారంగి చర్చను గతవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇవాళ మోడీ ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు. సభలో విపక్షాలు చేసిన ఆరోపణలకు తగినరీతిలో సమాధానం ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీను జైలుకు పంపాలని చూస్తున్నారని విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. దీనికి మోడీ కౌంటర్ ఇచ్చారు. ‘ మేం మీ లాగా ఇతరుల స్థానాలను ఆక్రమించుకో, మా మాతృసంస్థలతో ఇప్పుడే కాదు .. ఎప్పటికీ అందుబాటులో ఉంటాం‘ అని స్పస్టంచేశారు.
బాధ్యత మాదీ ...
అధికారం కట్టబెట్టిన ప్రజలకు విద్యుత్, ఇందనం, ఇళ్లు, మంచి రహదారి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ ఇన్నాళ్లు మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. కానీ కొందరు చూపులు పైనే ఉంటాయి .. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారి నేలను చూడలేరని విమర్శించారు. వారు అప్పుడు పైన ఉండి .. ఇప్పుడు అధ:పాతాళానికి పడిపోయారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని సమస్యలు .. ఇప్పుడు విపక్షానికి పరిమితమై నేలపైకి చూస్తున్నారని విమర్శించారు మోడీ.
సంక్షేమమే ఇంపార్టెంట్ .....
గత ఐదేళ్లుగా మేం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు మోడీ. ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఉందన్నారు. దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే అదృష్టం తమకు కలిగిందన్నారు. ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని .. కానీ తాను ఎప్పుడూ వాటిని పట్టించుకోనని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరే దాంట్లో లేదన్నారు మోడీ. ఇదే జీవితానికి అర్థం అని .. జీవిత లక్ష్యమని స్పష్టంచేశారు. అంతేకాదు తమపై విశ్వాసం ఉంచి తమకు మరోసారి పట్టం కట్టిన ప్రజలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.