రేపటినుంచి బ్యాంకుల్లో నగదు మార్పిడి రెండువేలే : పెళ్లిళ్లకు రూ.2.5లక్షలు
న్యూఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల ద్వారా రోజుకు రూ.4500 నగదు మార్పిడి (పాత నోట్లను మార్చుకునే వెసులుబాటు) చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని సవరిస్తూ.. రేపటి నుంచి ఆ మొత్తాన్ని కేవలం రూ.2000కే పరిమితం చేయనున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వెల్లడించారు.
పెళ్లిళ్ల సీజన్ కావడం.. రైతులకు వెసులబాటు కల్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు. రూ.2000 నగదు మార్పిడి పరిమితి ద్వారా మరింత మందికి నగదు అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా ఆర్బీఐ ఆలోచన. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పెళ్లిళ్లు జరిగే కుటుంబాలకు ఎక్కువ నగదు మొత్తాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్బీఐ చర్యలు చేపట్టింది.
ఈ మేరకు గుర్తింపు కార్డుతో పాటు పెళ్లికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపించడం ద్వారా.. రూ.2.5లక్షలను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రైతుల రుణ భీమా ప్రీమియం చెల్లింపుల గడువును మరో 15రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రైతులు కెవైసీ వివరాలను తెలియపర్చాలి. అలాగే రైతులకు వారానికి రూ.25వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అయితే కిసాన్ క్రెడిట్ దారులకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుందని పేర్కొన్నారు.
కాగా, ఏపీఎంసీ మార్కెట్లో రిజిస్టర్ అయిన వ్యాపారులకు రూ.50వేల నగదును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (గ్రూప్ సీ ఉద్యోగుల వరకు) సాలరీ అడ్వాన్స్ కింద రూ.10వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టుగా శక్తికాంత దాస్ తెలిపారు. ఆసుపత్రుల విషయంలో.. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
అయితే తాజా సవరణల నేపథ్యంలో.. నగదు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ఱయాలు తీసుకున్నారా? అని శక్తికాంత దాస్ ను ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారాయన. ప్రభుత్వం వద్ద సరిపడా డబ్బు అందుబాటులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించిన కీలక అంశాలు:
* వివాహ వేడుకల కోసం కేవైసీ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2.5లక్షల నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
* పంట రుణం కింద మంజూరైన నిధులను లేదా తమ ఖాతాలకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి రూ.25వేలను రైతులు విత్ డ్రా చేసుకోవచ్చు.
* కిసాన్ క్రెడిట్ దారులకు కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. రైతులంతా తప్పనిసరిగా కేవైసీ వివరాలు అందించాలి.
*కేవైసీ వివరాలు అందించే ఖాతాలు తప్పనిసరిగా రైతుల పేరు మీదే ఉండాలి. రుణ పరిమితులకు లోబడి ఉండాలి.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (గ్రూప్ సీ ఉద్యోగుల వరకు) సాలరీ అడ్వాన్స్ కింద రూ.10వేలు విత్ డ్రా చేసుకోవచ్చు.
* ఏపీఎంసీ (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటి)లో రిజిస్టర్ అయినవారు వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
* నగదు మార్పిడి ద్వారా రేపటి నుంచి ప్రతీ ఒక్కరికి కేవలం రూ.2000 మాత్రమే ఇస్తారు.