అందుకే మద్యం హోం డెలివరీ, ఛీ.. ఏం ఆలోచన: నిప్పులు చెరిగిన ఉద్ధవ్ థాకరే
ముంబై: మహారాష్ట్రలో త్వరలో మీరు మద్యాన్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు మహారాష్ట్ర మంత్రి ప్రకటన చేశారు. మద్యాన్ని ఆన్ లైన్ ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది మద్యం కాదని, సాయం కోసం చూస్తున్నారన్నారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కూరగాయాలు, నిత్యావసర వస్తువులు.. ఇలా ఏది కావాలన్నా ఇప్పుడు చాలామంది ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే దారిలో మద్యంను హోం డెలివరీ చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటికే మద్యం సరఫరా
డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరిగి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్నందున మద్యాన్ని నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలాంటి చర్య మద్యం పరిశ్రమలో వినూత్న మార్పులు తీసుకురానుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఈ కామర్స్ వ్యవస్థ ఎలా నడుస్తుందో ఇది కూడా అలాగే ఉంటుందన్నారు. ప్రజలు కూరగాయలు, కిరణా వస్తువులు తెప్పించుకుంటున్నట్లు ఆర్డర్ చేయవచ్చునని చెప్పారు.
ఉద్ధవ్ థాకరే ఆగ్రహం
ఆన్లైన్ ద్వారా ఎవరైనా మద్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు నిబంధనలు తీసుకు రానున్నారు.కనీస వయస్సు, ఆధార్ వివరాలు తీసుకుని నిర్ధారించుకున్నతర్వాతే మద్యాన్ని హోండెలివరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి మద్యం సీసాకు జియోట్యాగింగ్ ఉంటుందని, దీంతో తయారీ దశ నుంచి వినియోగదారునికి చేరే వరకూ మొత్తం వివరాలను ట్రాక్ చేయొచ్చన్నారు. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు, స్మగ్లింగ్ వంటి ఘటనలు తగ్గుతాయన్నారు.
ఆలోచన సిగ్గుచేటు
ఆన్ లైన్ మద్యం అమ్మకం ఆలోచనపై ఉద్ధవ్ థాకరే నిప్పులు చెరిగారు. ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని, మద్యం కోసం కాదన్నారు. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు, హోం డెలివరీ చేయడం వంటివి రాష్ట్ర సంస్కృతికే విరుద్ధమన్నారు. తగిన వర్షపాతం లేక ఆహార పదార్థాల కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అక్కడ సహాయం చేయాలన్నారు. ఇలాంటి ఆలోచన సిగ్గుచేటు అన్నారు.
మంత్రి, ఫడ్నవీస్ వివరణ
దీనిపై విమర్శలు రావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రి చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఆన్లైన్లో మద్యం విక్రయాలు కేవలం ప్రతిపాదన మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం ఏమీ యోచించలేదన్నారు. అన్నారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో మద్యం విక్రయం, హోం డెలివరీ వంటి ఆలోచన ఏదీ ప్రభుత్వం చేయడం లేదన్నారు.